టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు: ఆరుగురు మృతి
కృష్ణా: జిల్లాలోని నూజీవీడు మండలం తుక్కులూరు గ్రామం అడవి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో పదిమందికి గాయాలయ్యాయి
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... నూజీవీడు స్టేషన్ తోటకు చెందిన 30మంది జంగారెడ్డిగూడెం గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనార్థం రెండు ట్రాలీ ఆటోల్లో బయలుదేరారు. తుక్కులూరు గ్రామం వద్ద ఆటోలను పక్కకు నిలిపి ఉంచిన సమయంలో ఎదురుగా వస్తున్న ఓ టిప్పర్ వారిపైకి దూసుకెళ్లింది.
కాగా, ఘటన అనంతరం టిప్పర్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో గుర్రం శ్రీను(28), వీరయ్య(40), కిశోర్(18), శ్రీను(35), రాణి(20), చిన్న వెంకటేశ్వరరావు(70) మృతి చెందారు. వీరంతా ఒక కుటుంబానికి చెందినవారిగా సమాచారం. ఘటనా స్థలాన్ని నూజీవీడు రూరల్ ఎస్సై సీహెచ్ నాగప్రసాద్ పరిశీలించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.