ఏపీ మంత్రి బాలినేనికి తప్పిన ప్రమాదం: కాన్వాయ్ వాహనం బోల్తా, కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా పెద్దఅంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్కార్ట్ వాహనం టైర్ పేలి పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో మరో బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కాన్వాయ్లో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాపయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మరో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్ నగర్లోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం నుంచి మంత్రి క్షేమంగా బయటపడ్డారు. మృతి చెందిన కానిస్టేబుల్ పాపయ్య కుటుంబానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని పరామర్శించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.