అమరావతి-విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు, వరద బీభత్సం
హైదరాబాద్/అమరావతి: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వాగులు పొంగుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల ధాటికి రహదారులు కోతకు గురయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి.
జాతీయ రహదారులపై భారీ ఎత్తున నీరు ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. గుంటూరు-నరసరావుపేట, అమరావతి-విజయవాడ మధ్య రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. ఈ మార్గాల్లో ఉన్న రహదారులు కొట్టుకుపోవడానకి తోడు, రహదారులపై భారీఎత్తున వరద నీరు ప్రవహిస్తుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.
పల్నాడులో వరద బీభత్సం
పల్నాడుతో పాటు డెల్టాలో వరద బీభత్సం సృష్టించింది. పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రెడ్డిగూడెం వద్ద బ్రిడ్జి కూలింది. పలుచోట్ల చెరువులకు, వాగులకు గండ్లు పడ్డాయి. నల్లమల వాగుకు నాలుగు చోట్ల గండి పడింది. గుంటూరు - నడికుడి మార్గంలో రైళ్లు రద్దయ్యాయి. రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది.
హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. సాధ్యమైనంత వరకు నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అవకాశమున్నంతలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు.
ఈ మేరకు ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితిపై అప్ డేట్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12 శ్మశానం వద్ద పెద్ద గోతులు పడ్డాయని, మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ చివర మహావీర్ ఆసుపత్రి వద్ద పరిస్థితి బాగోలేదని పేర్కొన్నారు.
కేబీఆర్ పార్కు నుంచి భారీగా వర్షపు నీరు బయటకు వస్తోందని తెలిపారు. దాంతో జూబ్లీహిల్స్ వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, గాంధీభవన్ వద్ద నీరు నిలిచిపోయిందని చెప్పారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలేదని, నిమ్స్ ఆసుపత్రి వద్ద భారీగా నీరు నీలిచి పోయిందని వెల్లడించారు.
మలక్ పేట గంజ్ గేట్ నెం.1 వద్ద రోడ్డు మొత్తం పాడైపోయిందని తెలిపారు. దీంతో మలక్ పేట గంజ్ నుంచి అక్బర్ బాగ్ వైపు ట్రాఫిక్ మళ్లించినట్టు తెలిపారు. పురానాపూల్-జియాగూడ రోడ్డులో ఓ ఇంటి గోడ కుప్పకూలి రోడ్డుపై పడడంతో అక్కడ వాహనాలు నిలిచిపోయాయని, రోడ్డును బ్లాక్ చేయాల్సి వచ్చిందని, అందుకని అటువైపు రావద్దని వాహనదారులకు సూచించారు.