కృష్ణానదికి గండి: కొట్టుకుపోయిన ఇటుక బట్టీలు: బిక్కుబిక్కుమంటోన్న లంక గ్రామాలు!
గుంటూరు: ఎగువ ప్రాంతాలతో పాటు ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహానికి గురైన కృష్ణానది మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత అధికంగా నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల కృష్ణానదికి గండిపడింది. గుంటూరు జిల్లా వైపు కృష్ణానదికి ఆనుకుని ఉన్న పెసర్లంక వద్ద గట్లను తెంచుకుంది కృష్ణమ్మ. ఫలితంగా పెద్ద ఎత్తున వరద నీరు పెసర్లంక గ్రామ పరిసరాలను ముంచెత్తుతోంది. పెసర్లంక గ్రామ శివార్లలోని ఇటుక బట్టీలు కొట్టుకుపోయాయి. ఇటుక బట్టీల వద్ద మోకాలి లోతున వరదనీరు ప్రవహిస్తోంది. సుమారు 38కి పైగా లంక గ్రామాలు ముంపు వాకిట్లో ఉన్నట్లు జిల్లా పాలనాయంత్రాంగం గుర్తించింది. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వరదనీరు గ్రామాల్లోకి ప్రవహించకుండా ఇసుక బస్తాలను అడ్డు పెడుతున్నారు.
గుంటూరు జిల్లా పెసర్లంక గ్రామం సమీపంలో కృష్ణానదికి శుక్రవారం ఉదయం గండి పడింది. కొల్లూరు లాక్ సెంటర్ సమీపంలో ఉన్న ఇటుక బట్టీలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. పలు గ్రామాల్లోని పంట పొలాలు జలమయం అయ్యాయి. వరద నీరు ఇలాగే కొనసాగితే పెసర్లంక కరకట్ట పరిసర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ వరదలో మునిగిపోయే ప్రమాదముందని జిల్లా అధికారులు అనుమానిస్తున్నారు. పలుచోట్ల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కృష్ణా నదికి వరద రోజు రోజుకు పెరిగిపోతుంటంతో లంక గ్రామాలవాసులు బిక్కు బిక్కుమంటు గడుపుతున్నారు. వరద తాకిడి మరింత అధికమయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచీ శుక్రవారం ఉదయానికి ఏడు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేశారు. దీని ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ మీద మరింత ఒత్తిడి ఏర్పడింది.
ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు ఆరున్నర లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రం వైపు వదులుతున్నారు జల వనరుల శాఖ అధికారులు. ఫలితంగా- కృష్ణమ్మ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. గుంటూరు జిల్లా వైపు సముద్రానికి అతి సమీపంలో ఉన్న పెసర్లంక వద్ద కృష్ణానదికి గండి పడింది. పరిస్థితి తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే.. సాయంత్రానికి 38కి పైగా లంక గ్రామాల్లో వరదనీరు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పెసర్లంక, పోతర్లంక, చినతూర్పుపాలెం, పెదలంక, పల్లిపాలెం వంటి లంక గ్రామాల్లో వరదనీరు ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. పెద్ద ఎత్తున ఇసుక బస్తాలు, స్టోన్ క్రష్ మూటెలను సిద్ధం చేశారు. దాచేపల్లి, మాచవరం, బెల్లంకొండ, అచ్చంపేట దుగ్గిరాల, అమరావతి, కొల్లిపారా, కొల్లూరు, రేపల్లె మండలాల పరిధిలోనే లంక గ్రామాల్లో భయాందోళనలను నెలకొన్నాయి.
జంతువుల కన్నా హీనంగా బంధించారు: హోం మంత్రికి మాజీ సీఎం కుమార్తె వాయిస్ మెసేజ్
పెద్ద సంఖ్యలో ప్రజలను అధికార యంత్రాంగం పునరావాస శిబిరాలకు తరలించింది. కాగా- కృష్ణానదికి ఎగువ నుంచి మరింత వరద ప్రవాహం నమోదు కావడం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 8, 78, 534 లక్షల క్యూసెక్కులు, నాగార్జున సాగర్నుండి 7, 45, 034 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి మరో 6,85,093 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు ప్రకాశం బ్యారేజీకి వదిలారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యం తక్కువ పరిణామంలో ఉన్న నేపథ్యంలో.. 70 గేట్లను ఎత్తివేసి, కృష్ణా జలాలను సముద్రానికి వదిలేశారు. నీటి ప్రవాహం సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉండటంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.