రోడ్డు నిర్మాణ పనులు...లైవ్లో సీఎం సమీక్ష:అధికారుల ఉరుకులుపరుగులు
గుంటూరు:ఒకవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటూనే మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అభివృద్ది పనులను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
భవిష్యత్తుల్లో ఆర్టీజిఎస్ తోడ్పాటు పరిపాలనలో ఎంతో సహకరిస్తుందనేది తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన ద్వారా అటు అధికారులకే కాదు ఇటు జనాలకు కూడా బాగా అర్థమైంది. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో నిబంధనల ప్రకారం వేయాల్సిన రోడ్డును అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లుగా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం అందింది. దానివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు నాణ్యత లోపించింది. అది తెలిసి సిఎం ఏం చేశారంటే?...
రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా మలేషియా టెక్నాలజీతో కొల్లిపర మండల వల్లభాపురం నుంచి చినపాలెం వరకు నాబార్డు నిధుల కింద రూ.2.80కోట్లతో పంచాయతీరాజ్ ప్రాజెక్టు అధికారులు ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి ముందు కల్వర్టులు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇక్కడ అవేం చేయలేదు. కానీ ఆ తర్వాత కల్వర్టులు నిర్మాణం చేపట్టడంతో స్ధానిక రైతులు ఇబ్బందులు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యతకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ విషయం ఎలాగో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన వెంటనే స్పందించి ఆ రోడ్డు వివరాలను తనకు వెంటనే తెలియజేయాలని ఈఎన్సీ ఆర్.వెంకటేశ్వరరావును ఆదేశించారు. సాక్షాత్తూ సిఎం ఒక రోడ్డు నిర్మాణం గురించిన వివరాలు అడగడంతో ఆయన వెంటనే స్పందించి సంబంధిత ఉన్నతాధికారులను రంగంలోకి దించారు. పీఆర్ఎస్సీ కేజే నతానియేల్, ఈఈ సుబ్రహ్మణ్యం తన బృందంతో కలిసి చివలూరు - కొల్లిపర రోడ్డును పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు. తర్వాత వల్లభాపురం నుంచి చినపాలెం రోడ్డు, కల్వర్టులను పరిశీలించారు. ఆ తరువాత రోడ్డు పని తీరు వివరాలను ఈఎన్సీ వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబుకు వివరించారు.
అయితే ఆ వివరాలపై సంతృప్తి చెందని సిఎం అసలు విషయం తెలుసుకునేందుకని సెక్రటరేట్లోని రియల్టైమ్ గవర్నసెస్(ఆర్టీజీ) ను వినియోగించారు. అక్కడ నుంచి ఆ రోడ్డును వర్చువల్ తనిఖీ నిర్వహించారు. ఆ తరువాత ఆ రోడ్డు నిర్మాణంలో కీలక బాధ్యుడైన ఈఈ సుబ్రహ్మణ్యంతో నేరుగా లైవ్లో మాట్లాడారు. అతని వివరణతో సంతృప్తి చెందని సిఎం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోపుగా రోడ్డును పూర్తిగా నిబంధనల మేరకు సరిచేసి తనకు రిపోర్టు పంపించాలని అక్కడికక్కడే ఆదేశించారు. లేకపోతే తగిన చర్యలు తప్పవని ఈఈని హెచ్చరించారు. అదే విషయాన్నిఈఎన్సీ ఆర్.వెంకటేశ్వరరావుకు సైతం తెలిపారు. దీంతో ఈ ఆర్టీజిఎస్ టెక్నాలజీ గురించి వినడమే కాని పనితీరు తెలియని అనేకమంది అధికారులకు ఈ ఉదంతంతో తత్వం బోధపడింది.