పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయండి, ట్యాక్సీ యజమానులను వేధించొద్దు, : పవన్ కల్యాణ్
ట్యాక్సీ యజమానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. లాక్ డౌన్ వల్ల వారి పరిస్థితి దుర్భరంగా మారిందని గుర్తుచేశారు. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న ట్యాక్సీ యజమానులు.. ఇప్పుడు ఆడపా దడపా మాత్రమే బిజినెస్ సాగుతోందని చెప్పారు. వారికి పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమయంలో పర్మిట్ ఫీజు చెల్లించాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారని.. దీనిని వెనక్కి తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.
పన్ను పోటు..?
ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన యజమానులు వాహనాల లోన్ కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఉపాధి లేక, చేతిలో నగదు లేక వారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కానీ నెలాఖరులోగా పన్ను చెల్లించాల్సిందేనని ఆర్టీఏ స్పష్టంచేయడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. వారి బాధను జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారని.. వారి బాధలను విన్న తాము న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.
3 నెలల నుంచి ఇంట్లోనే..
3 నెలల నుంచి ట్యాక్సీ యజమానులకు ఉపాధి లేకపోవడంతో.. ఇల్లు గడవడమే కష్టంగా మారిపోయిందని చెప్పారు. ఇంట్లో తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతోన్న ట్యాక్సీ యజమానులను.. పర్మిట్ ఫీజు కట్టాలని ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు. కరోనా వైరస్ వల్ల సీట్ల కుదింపు కొనసాగుతోందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అయితే చెల్లించే పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలనీ సూచించారు.
ఆదుకోండి
రవాణా రంగంలో కీలకమైన క్యాబ్ యజమానులు, డ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. కానీ పర్మిట్ ఫీజుల పేరుతో వేధించడం మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే ఆర్టీఏ అధికారులకు చెప్పి.. వేధింపులను ఆపేయాలని కోరారు.