రహదారులు అధ్వాన్నం.!శ్రమదానం చేసిన జనసేన.!అభివృద్ది శూన్యమన్న నాదెండ్ల మనోహర్.!
అమరావతి/హైదరాబాద్ : రెండున్నరేళ్లుగా రహదారులకు కనీసం మరమ్మతులు చేపట్టడం లేదని, అందుకు నిధులు కూడా మంజూరి చేయడం లేదని, రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యిందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైసీపి పాలన రెండేళ్లలో రోడ్ల కోసం 13,708 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రవేశపెట్టారని, ఇతర సంస్థల నుంచి రుణాలు తెచ్చారని, ఆ నిధులన్నీ ఎటు దారి మళ్లించారని నాదెండ్ల మనోహర్ వైసీపి ప్రభుత్వాన్ని నిలదీసారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.
వైసీపి ప్రభుత్వం మొద్దు నిద్ర.. ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వమని జనసేని పార్టీ ఫైర్
అంతే కాకుండా అక్టోబర్ 2వ తేదీన స్వయంగా శ్రమదానం చేయడానికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చి రాజమండ్రిలో, అనంతపురం జిల్లా కొత్తచెరువులో స్వయంగా ప్రారంభించేందుకు ముందుకు వచ్చారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేసారు. రాజమండ్రి శ్రమదాన కార్యక్రమాన్ని ఆపేందుకు అన్ని శక్తులను వాడారని, ముఖ్యమంత్రి, ఆయన సలహాదారు స్వయంగా డీఎస్పీ స్థాయి అధికారులతో మాట్లాడి సభకు వచ్చే జనసైనికులను ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఐనప్పటికి జనసైనికులు, వీర మహిళలు ఎక్కడా ఆగలేదని, అధ్యక్షుల వారి పిలుపు మేరకు ముందుకు వచ్చి సభను విజయవంతం చేశారన్నారు నాదెండ్ల మనోహర్. కొత్త చెరువులో అయితే నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్డును పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలుసుకుని పూడ్చేశారని అన్నారు.
సీఎం పైశాచికానందం.. అభివృద్ది శూన్యమన్న మనోహర్
ఓ పక్క రహదారులన్నీ గోతులతో నిండి ఉండగా మరోపక్క రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సరైన స్పందన లేకపోడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మనకెందుకులే అన్నట్టు బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థ పటిష్టంగా లేకపోతే యంత్రాంగం పని తీరు ఎందుకు బాగుంటుందని నిలదీసారు. రోడ్లకు మరమ్మతులు చేయరని, రైతుల్ని ఆదుకునే పరిస్థితులు అసలే లేవని, 30 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకు మాత్రం వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
రహదారులు నరకంగా మారాయి.. మంత్రుల్లో ఏమాత్రం చలనం లేదన్న నాదెండ్ల
ప్రజలు బాధల్లో ఉంటే డబ్బులు కట్టాలంటూ వేధిస్తు ముఖ్యమంత్రి పైశాచికానందం పొందుతున్నారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్ల దుస్థితి, రైతుల కష్టాలు, వన్ టైమ్ సెటిల్మెంట్, ఈ మూడు అంశాల మీద జనసేన పార్టీ ఉద్యమిస్తుందని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని అన్నారు. పెద్దపెద్ద గోతులతో ఛిద్రమైన మండపేట, ద్వారపూడి ప్రధాన రహదారిపై శ్రమదానం చేసారు మనోహర్. రెండు కిలోమీటర్ల మేర రహదారిని బాగు చేశారు. ఇప్పనపాడు గ్రామం వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్ స్వయంగా పార పట్టి గ్రావెల్ రోడ్డును గుంతలు లేకుండా చేసారు.
Recommended Video
రెండున్నరేళ్లుగా రోడ్లకు మరమ్మతులు లేవు..రోడ్ల పేరు చెప్పి రుణాలు చేసారన్న మనోహర్
ప్రొక్లెయిన్, రోడ్డు రోలర్లతో పూర్తి స్థాయిలో నిర్మిస్తున్న రహదారి పనులను పర్యవేక్షించారు మనోహర్. పూర్తిగా పాడై ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న రహదారిని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు పార్టీ పక్షాన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశ్యంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మనోహర్ తెలిపారు. మండపేట నుంచి శ్రమదానం సందర్బంగా జనసేన శ్రేణులు వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించాయి. జనసేన నినాదాలతో హోరెత్తించాయి. జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యక్రమాల విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులు, పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.