మహిళపై తొలిసారి రౌడీషీట్ తెరిచారు: బస్సుల ఢీ, ఇద్దరు మృతి
విజయవాడ: రౌడీ షీటర్లంటే నేరాలకు పాల్పడే పురుషులే గుర్తుకు వస్తారు. అయితే, అందుకు భిన్నంగా ఓ మహిళపై కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. నగరంలో గత 15 ఏళ్లలో ఓ మహిళపై రౌడీ షీట్ తెరవడం ఇదే తొలిసారి.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 32ఏళ్ల మహిళపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఈ రౌడీషీట్ తెరిచారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నేరాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో ఆమెపై రౌడీ షీట్ తెరిచినట్టు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరని వారు స్పష్టం చేశారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: ఇద్దరు మృతి
చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును, శ్రీకాళహస్తి నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. రెండు బస్సుల్లో మొత్తం 80మంది ప్రయాణికులున్నారు. వీరిలో దాదాపు 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా పూతలపట్టు-నాయుడిపేట ప్రధాన రహదారిపై దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
తండ్రిపై కుమారుడి దాడి
కర్నూలు: కన్న కొడుకే కత్తితో దాడి చేయడంతో ఓ తండ్రి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రుద్రవరం మండలం ఆలమూరులో తండ్రిపై కొడుకు సోమవారం ఉదయం కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారు.