సహజీవనం చేస్తూ దోపిడీలు: యువతీ, యువకుల అరెస్ట్(పిక్చర్స్)
విశాఖపట్నం: వ్యసనాలకు బానిసలైన ముగ్గురు యువకులు, వీరిలో ఒకరితో సహజీవనం చేస్తున్న యువతి.. ఓ ముఠా ఏర్పడి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. పక్కా ప్రణాళికలతో దోపిడీలకు పాల్పడే ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 255 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జేసీపీ ఎఎస్ ఖాన్ వెల్లడించారు.
మీడియా సమావేశం
ఆదివారం సాయంత్రం పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జి. మాడుగుల మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన పూసర్ల హరీష్(25) 10ఏళ్ల కిందట రోలుగుంట మండలం జానకిరామపురంలో స్థిరపడ్డాడు. ఇంజినీరింగ్ చదువుకున్న హరీష్.. మొదట్లో కిరణా వ్యాపారం చేసేవాడు.
వ్యసనాలకు బానిసై..
ఆ తర్వాత వ్యవసనాలకు బానిసైన హరీష్.. నర్సీపట్నానికి చెందిన గొర్లె చంద్రశేఖర్(19), రోలుగుంట గ్రామానికి చెందిన తమరాస అచ్యుతరావు(22)లతో కలిసి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించాడు. ఇందుకోసం నర్సీపట్నంలోనే ఒక గది అద్దెకు తీసుకున్నారు.
దొంగతనాలకు ప్లాన్
ఈ క్రమంలో గాజువాక ప్రాంతానికి చెందిన వివాహిత యజ్జరపు దమయంతి బ్యూటీషియన్గా పని చేస్తోంది. ఆమె ఓ పెళ్లి కోసం నర్సీపట్నం వెళ్లి బంధువుల ఇంట్లో 15రోజులు ఉంది. అదే సమయంలో అక్కడే ఉంటున్న హరీశ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనానికి దారితీసింది. అప్పటికే గంజాయి వ్యాపారంతో నష్టపోయిన హరీశ్.. దమయంతితో కలిసి దొంగతనాలు ప్రారంభించాడు.
దమయంతిదీ కీలక పాత్రే
దమయంతి సలహా మేరకు ముందుగా విజయనగరం జిల్లా దాసన్నపేటలోని ఆమె నానమ్మ ఇంట్లోనే గత నెల 1వ తేదీన ముగ్గురు యువకులూ చోరీకి పాల్పడ్డారు. బంగారు గొలుసు, లాకెట్ అపహరించుకుపోయారు. ఆ తర్వాత పెందుర్తి శివారు సింహగిరికాలనీలో నివాసం ఉంటున్న ఇల్ల ప్మనాగ వెంకటలక్ష్మి అలియాస్ శైలు ఇంట్లో సెప్టెంబర్ 3న దొంగతనం చేశారు. ఆమె వద్ద బంగారు గొలుసు, నెక్లెస్, రెండు చిన్న పిల్లల గొలుసులు, బంగారు గాజులు, రింగ్లు చోరీ చేశారు.
పోలీసుల అదుపులో ఇలా..
సీసీఎస్ ఏసీపీ వై గోవిందరాజులు సేకరించిన సమాచారం ప్రకారం అక్టోబర్ 14న రాత్రి 7గంటల సమయంలో నిందితులను గాజువాక శ్రామిక్ నగర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని జేసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ గోవిందరాజులు, సీఐ శ్రీనివాసులు, పెందుర్తి సీఐ షణ్ముఖరావు, సీసీఎస్ ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రవికుమార్, సురేష్, రామారావు, హెచ్ సీలు శ్రీనివాసరాజు, శ్రీనివాస్, పీసీలు జయకుమార్, అప్పలరాజు, గోపీ, శ్యామ్, రాము, మహిళా పీసీ వల్లిని ఉన్నతాధికారులు అభినందించారు.