ఎలా తెరిచారో గానీ.. బ్యాంకు లాకర్ లో దాచి ఉంచిన రూ.7 లక్షల బంగారం మాయం
గుంటూరు: జిల్లాలోని నరసరావు పేటలో చోటు చేసుకున్న చోరీ ఘటన కలకలం రేపింది. బ్యాంకు లాకర్ లో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దాని విలువ సుమారు ఏడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో పదవీ విరమణ చేసిన బ్యాంకు మాజీ అటెండర్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లాకర్ లో దాచి ఉంచిన నగలు మాయం కావడంపై ఖాతాదారుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితునితో పాటు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికోసం సీసీటీవీ ఫుటేజీలను వారు పరిశీలిస్తున్నారు.
నరసరావు పేటకు చెందిన ఓ వ్యాపారికి స్థానిక యూనియన్ బ్యాంకులో లాకర్ తీసుకున్నారు. అందులో బంగారు నగలను దాచుకున్నారు. ఆ వ్యాపారికి చెందిన లాకర్ లో నుంచి బంగారం మాయమైంది. ఈ విషయాన్ని బ్యాంకు సిబ్బంది ఆలస్యంగా తెలుసుకున్నారు. తన లాకర్ ను పరిశీలించడానికి వచ్చిన సదరు వ్యాపారి.. దాన్ని తెరిచి చూసే సరికి అది ఖాళీగా కనిపించింది. దీనితో ఆయన వెంటనే ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ రాజేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుందనే విషయంపై బ్యాంకు సిబ్బంది వద్ద సరైన సమాచారం లేదు. దీనితో వారు- అనుమానితులను గుర్తించడానికి బ్యాంకులో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా- పదవీ విరమణ చేసిన ఓ అటెండర్.. స్ట్రాంగ్ రూమ్ వద్ద అనుమానస్పదంగా తచ్చాడినట్లు గుర్తించారు. ఇదివకు అదే బ్యాంకులో పనిచేసి ఉండటంతో.. అక్కడి ఉద్యోగులతో పరిచయం ఉంది. ఆ పరిచయాలను అడ్డుగా పెట్టుకుని, అనధికారికంగా స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయనే చోరీ చేసి ఉంటారనడానికి సరైన సాక్ష్యాధారాలు ఇంకా లభించలేదు. బ్యాంకు మేనేజర్ రాజేష్, సహా బాధిత వ్యాపారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.