చిక్కుల్లో రోజా.. : ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ : మొన్నటిదాకా అసెంబ్లీ సస్పెన్షన్ నుంచి బయటపడేందుకు కోర్టుల చుట్టూ తిరిగిన వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. ఎమ్మెల్యేగా ఆర్కే రోజా ఎన్నికను సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో, కోర్టు రోజాకి నోటీసులు జారీ చేసింది.
అయితే తాజా పిటిషన్ పై స్పందించిన ఫైర్ బ్రాండ్ రోజా, తనపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు, రెండింటిపై ఒకేసారి ఇరువురి వాదనలు వింటామని ప్రకటించింది. కాగా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రోజా ఒకేసారి రెండు పిటిషన్ల వాదనలు వినడం చట్టబద్దం కాదన్నారు.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకేసారి రెండు పిటిషన్ల వాదనలు వినడం కాకుండా వేర్వేరుగా అవకాశం కల్పించాలని సుప్రీం ధర్మాసనానికి విన్నవించుకున్నారు. కాగా ఎమ్మెల్యే రోజా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వచ్చే నెల చివరి వారంలో దీనిపై విచారణ చేపట్టనున్నట్టు సమాచారం.