రోజాకు 'ప్రివిలేజ్' పిలుపు: అనిత కంటతడి, 'బాబుని ఎన్నేళ్లు సస్పెండ్ చేయాలి'
హైదరాబాద్: రోజా అంశంపై రేపు (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి వైసిపి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కొడాలి నాని, జ్యోతుల నెహ్రూ, టిడిపి ఎమ్మెల్యే అనితను పిలిచారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని వారికి నోటీసులు పంపారు. తన పట్ల రోజా అనుచితంగా ప్రవర్తించారని అనిత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రోజాను శాసన సభలోకి అనుమతించకపోవడం బాధాకరమని వైసిపి ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి అన్నారు. సభలోకిరాకుండా రోజాను అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డే అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. శాసన సభా ప్రాంగణం ఈ రోజు యుద్ధవాతావరణాన్ని తలపించిందన్నారు.
ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే భావన కలుగుతోందన్నారు. చంద్రబాబు నిరంకుశ పాలనలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారని, కోర్టు కంటే తామే పెద్దవాళ్లమన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
చట్టాన్ని చుట్టంగా మార్చుకొని పాలన కొనసాగిస్తున్నారన్నారు. అకారణంగా రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. కనీసం ఆమె నుంచి సంజాయిషీ కూడా కోరలేదన్నారు. రోజాను టార్గెట్ చేస్తున్నారని, వ్యక్తిగత దూషణతో పాటు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.
రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిందనే సభ నుంచి సస్పెండ్ చేశామని చెబుతున్నారని, మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబును ఎన్ని రోజులు సస్పెండ్ చేయాలని నిలదీశారు. కోర్టు ఆదేశాలను అనుసరించి రోజాను సభకు అనుమతించాలన్నారు.
రోజా సస్పెన్షన్ పైన కచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దళిత ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోజాను సభలోకి అనుమతించకపోతే ఏం చేయాలో రేపు నిర్ణయిస్తామని చెప్పారు.
కాగా, రోజాను అసెంబ్లీలోకి వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్న సమయంలో ఆ ఘటనను చిత్రీకరించడానికి అక్కడికి మీడియాను అనుమతించని విషయం తెలిసిందే. ఈ దృశ్యాలను మీడియాకు చూపించిన జగన్, మాట్లాడారు.
రోజాను నడి రోడ్డుపై వదిలి మేము అసెంబ్లీ లోపలికి వెళ్లే అవకాశాలు లేవని, ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని, కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్న అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీని చంద్రబాబు ప్రభుత్వం అధీనంలోకి తీసుకుందని ఆరోపించారు.
మరోసారి అనిత కంటతడి!
టిడిపి ఎమ్మెల్యే అనిత మరోసారి కంటతడి పెట్టారు. తాను ఏం పొరపాటు చేశానని అసెంబ్లీలో ఆనాడు రోజు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె కంటతడి పెట్టారు.
తన తల్లిదండ్రులు సైతం అనని మాటలు అన్న రోజా ఇప్పుడు తానేమీ తప్పు చేయలేదని కోర్టు చెప్పిందంటూ సగర్వంగా ముందుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజా కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. అసెంబ్లీలో రోజా తనను దూషించారంటూ గతంలోను అనిత కంటతడి పెట్టారు.