ప్రివిలేజ్ ముందుకు రోజా: 'సారీ'పై ఉత్కంఠ, కఠిన చర్యలు తప్పదా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా బుధవారం నాడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఏడాది పాటు సస్పెన్షన్, ఆ తర్వాత ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు నేపథ్యంలో.. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని రోజాకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు హాజరు కానున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవుతారు. అనిత విషయంలో తన వాదనలు వినిపిస్తారు. నిండు సభలో సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ పడిన విషయం తెలిసిందే.
అనంతరం ఇది కోర్టుకు వెళ్లింది. ఆ తర్వాత అనిత... రోజా పైన ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై రోజా వివరణ ఇవ్వనున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు రోజా క్షమాపణ చెప్తే ఆమె పట్ల ప్రివిలేజ్ కమిటీ కాస్తంత సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఆమె మాత్రం క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా లేరు.
ఆమె క్షమాపణ చెప్పే అవకాశం లేదని చాలామంది భావిస్తున్నారు. క్షమాపణ చెప్పకుంటే అధికార పార్టీ కూడా కఠినంగానే వ్యవహరించే అవకాశముందని అంటున్నారు. అమె పైన ఏడాది పాటు సస్పెన్షన్ అలాగే ఉంచడం లేదా పొడిగించడం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.
8న టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు సునీల్, సుబ్బారావు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వరుస కడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అధికారికంగా ఈ నెల 8న టిడిపిలో చేరనున్నారు. అదే రోజున ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా గూడూరు వైసిపి ఎమ్మెల్యే పాశం సునీల్ కూడా సైకిల్ ఎక్కనున్నారు.
మంగళవారం రాత్రి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మంత్రి నారాయణతో కలసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కలుసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఉండటంతో ఆయనకంటే ముందే మంత్రి నారాయణతో కలసి రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.
పది నిమిషాల తేడాతో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన రావు కూడా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. మంత్రి నారాయణ, సునీల్ కుమార్, గరికపాటి మోహన్ రావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. బుధవారం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యాక 8న తేదీన అనుచరులతో కలిసి టిడిపిలో చేరుతానని చెప్పారని తెలుస్తోంది. అనంతరం ముగ్గురు నేతలు ఒకే వాహనంలో వెళ్లిపోయారు.