హెరిటేజ్: 'నోట్ల రద్దుకు ముందే చక్కబెట్టుకున్న చంద్రబాబు', రోజా తీవ్ర వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజాలు ఆదివారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు వ్యవహారానికి ముందే తన వ్యవహారాలను చక్కబెట్టుకున్నారని వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కానీ పైకి మాత్రం తానే పెద్ద నోట్ల రద్దును సూచిస్తూ లేఖ రాశానని చెబుతున్నారని ఆదివారం నాడు ఎద్దేవా చేశారు.
తన హెరిటేజ షేర్ విలువ పెరిగిన స్థాయిలో రాష్ట్రాభివృద్ధి ఎందుకు జరగలేదని చంద్రబాబును బుగ్గన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముందే తెలుసునని చెప్పారు. అందుకే, తన వ్యవహారాలన్నింటిని ముందే చక్కబెట్టుకున్నారన్నారు.
నోట్ల రద్దుకు పదిరోజుల ముందే చంద్రబాబు హెరిటేజ్ షేర్లను అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు హెరిటేజ్ సంస్థ షేర్ విలువ రూ.199 ఉంటే, ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఆ షేర ధర రూ.999కి పెరిగిందన్నారు.
చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబు అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్గా మార్చేశారని రోజా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని అడిగిన వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణమన్నారు. దళితులను అగౌరవ పరిచేలా గతంలో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని సన్మానాలు చేయించుకుంటున్నారన్నారు. టిడిపి నేతలంతా ముందుగానే బ్లాక్ మనీని వైట్ చేసుకుని, హాయిగా తిరుగుతున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆదివారం నాడు తీవ్రస్ఖాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ఆడబిడ్డలు లేరు కాబట్టి వారి విలువ తెలియదన్నారు. ఆడబిడ్డల బాధ తెలియడం లేదన్నారు.
ఆడపిల్లల తల్లిదండ్రుల ఆందోళన, ఆక్రందన, ఆవేదన ఆయనకు అర్థం కావడం లేదన్నారు. కనీ చంద్రబాబును కన్నది ఓ మహిళ అని, సంసారం చేసేది ఓ మహిళ అని, కోడలు కూడా ఓ మహిళ అని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సీఎం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నారు. చంద్రబాబుకు బీచ్ ఫెస్టివెల్, బీర్ పార్లర్ల పైన ఉన్న శ్రద్ధ అమ్మాయిలను కాపాడటం పైన లేదన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేనప్పుడు చంద్రబాబు పదవిలో ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో రావణాసురులు ఉన్నారన్నారు.