ప్రతిదీ వివాదమే: వారిద్దరి దూకుడు జగన్కు ప్లస్సా, మైనస్సా?
వైసిపిలో రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎల్లవేళలా ఒకే దూకుడు ప్రదర్శిస్తుంటారు. ఆ దూకుడు జగన్కు మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా అనేది ప్రశ్న
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఇద్దరు శాసనసభ్యులు ఎక్కడలేని దూకుడు ప్రదర్శిస్తున్నారు. వారిలో ఒకరు రోజా కాగా, మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వారు ఏది మాట్లాడినా వివాదంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీపైనే కాకుండా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వారు విసిరే వాగ్బాణాలు ముళ్లుల్లా గుచ్చుకుంటాయి.
ఏ మాత్రం తడబడకుండా వారు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వంపై మాటల ఈటెలు రువ్వుతుంటారు. ఇరువురు కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారు కావడం, అది ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం విశేషం.
ఏరికోరి వారు వివాదాలను కొని తెచ్చుకుంటారనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడి తరిమి కొడతామని హెచ్చరించిన భాస్కర్రెడ్డి, తాజా వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఆయనపై ప్రభుత్వోద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.
రోజా నోట మాటలు ఈటెల్లా...
నగరి శాసనసభ్యురాలు రోజా మాటల ఈటెలను విసరడంలో దిట్ట. ఆమె పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. అసెంబ్లీలో ఈమె వ్యాఖ్య లు హావభావాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ వివాదం ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఏడాదిన్నర పాటు రోజా అసెంబ్లీకి దూరంగా ఉన్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే..
చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కఠినమైన పదజాలం వాడడంలో దిట్ట. ఆయన వ్యవహార శైలి కూడా అంతే దూకుడుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడి పేరు ఎత్తితే ఒంటికాలి మీద లేస్తారు. శాసనసభ్యుడిగా ఎన్నిక కాక ముందు ఆయనపై 80కి పైగా పోలీసు కేసులు నమోదయ్యాయి.
గల్లా అరుణకుమారిపై...
శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలి రోజుల్లో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబం మీద విరుచు కుపడేవారు. గత ఏడాదిగా ఆమె కుటుంబం ఊసు ఎత్తడం లేదు. అయితే అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పడేసేందుకు అసెంబ్లీలో ప్రయత్నిస్తుంటారు. పలు సందర్భాల్లో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
తాజాగా ఉద్యోగులపై...
పూతలపట్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో గురువారం తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉద్యోగులను హెచ్చరిస్తూ మాట్లాడారు. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు ఆయనపై భగ్గుమన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
ప్లస్సా, మైనస్సా...
రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూకుడు వైయస్ జగన్కు ప్లస్సా, మైనస్సా అనేది పెద్ద ప్రశ్న. పార్టీలో వారిద్దరి గొంతే ఎల్లవేళలా వినిపిస్తోంది. అది ఎంత వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందనేది తేల్చలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం అవసరమే గానీ అన్ని సందర్భాల్లోనూ అంత దూకుడు అవసరమా అనేది మాత్రం ఆలోచించుకోవాల్సిన విషయమే.