'సుహాసినిని అలా దెబ్బతీసిన చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ గుర్తించారు, ముందే చెప్పారు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నిప్పులు చెరిగారు. జాతీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశంను కాపాడుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఇక దేశాన్ని ఏం కాపాడుతారన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఓటమితో ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోవడం గమనార్హమని చెప్పారు. ఏపీలో చంద్రబాబు అరాచకాలను విన్నందు వల్లే తెలంగాణలో ప్రజలు తెరాసకు ఓటు వేశారన్నారు.
చంద్రబాబును నమ్మే స్థితిలో లేరు
చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని రోజా చెప్పారు. ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ మొండెం లేని తల వంటిదని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ను జైల్లో పెట్టించిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని అన్నారు.
సుహాసినిని దెబ్బతీసిన చంద్రబాబు, జూఎన్టీఆర్ గుర్తించారు
తన అనుకూల మీడియా, డబ్బు అండతో ఎన్నికల్లో గెలవాలనే చంద్రబాబు యత్నాలు ఫలించబోవని రోజా చెప్పారు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన విధంగానే జగన్ను ఏపీ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పారు. అప్పుడే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందన్నారు. చంద్రబాబు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు గుర్తించారన్నారు. నందమూరి సుహాసిని రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారన్నారు.
లగడపాటిపై రోజా సెటైర్లు
నందమూరి కుటుంబాన్ని ముఖ్యమంత్రి వాడుకుంటున్నారని ఆరోపించారు. విజయవాడ మాజీ ఎంపీ, లగడపాటి రాజగోపాల్ ఇక సర్వేల సన్యాసం తీసుకోవాలని రోజా సెటైర్ వేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే శకుని పాచికలాంటిదని ధ్వజమెత్తారు. ఆ సర్వే కుట్రపూరితమైనదని అన్నారు. టీడీపీకి మేలు చేయాలన్న ఆయన ఎత్తులను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. తెలంగాణలో తలెత్తిన ఓటమే చంద్రబాబుకు ఏపీలోను పునరావృతం కాకతప్పదన్నారు.
అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ను బతికించారు
తెలంగాణ ఫలితాలను చూసి ఏపీ ప్రజలు ఆనందించారని రోజా చెప్పారు. మనీ, మ్యానిపులేషన్, మీడియా చంద్రబాబును కాపాడలేకపోయాయన్నారు. కోట్టు ఖర్చు పెట్టి చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని, ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ది ఏమిటో చెప్పాలన్నారు. చంద్రబాబు రాజకీయ నేరగాడు, తప్పుచేసిన వారికి శిక్ష తప్పదన్నారు. అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ను వైయస్ రెండుసార్లు అధికారంలోకి తెచ్చారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓడటానికి చంద్ర గ్రహణమే కారణమన్నారు.
బట్టలూడదీసి కొడతారని చెప్పారు
చంద్రబాబును పట్టుకుని నడవటం కుక్క తోక పట్టుకుని నడవటమేనని రోజా అన్నారు. కుట్రలు చేసి కట్టలతో చంద్రబాబు గెలవాలనుకున్నారని, కానీ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. లగడపాటి మరో మాల్యా అని, అప్పులు ఎగ్గొట్టడానికి పథకం రచించారన్నారు. కాంగ్రెస్తో టీడీపీ కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్న పాత్రుడు ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. తాను ఒక్క సీటైనా గెలిపించానని, తన నాన్న (చంద్రబాబు) ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాడని పప్పు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పారు. చంద్రబాబు ఇక పప్పును ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మాల్సిందేనని, పప్పుకు కిరీటం పెట్టాలనుకున్న పథకాలు తారుమారయ్యాయన్నారు.