లోకేష్! పవన్తో కాదు జగన్ ఒంటరిగా..: చంద్రబాబు మాట, రోజా తూటా ఇలా..
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, ఆయన తనయుడు నారా లోకేష్ పైన వైసిపి నేత రోజా శుక్రవారం నిప్పులు చెరిగారు. ఆమె చంద్రబాబు గతంలో మాట్లాడిన వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు చూపిస్తూ, వాటికి కౌంటర్ ఇచ్చారు.
2014లో చంద్రబాబుతో పాటు మోడీ, పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా ఎన్నికలకు వస్తే, రాయలసీమ గడ్డమీద పుట్టిన దమ్మున్నోడిగా ఒంటరిగా పోటీపడ్డ వ్యక్తి జగన్ అని రోజా టిడిపి యువనేత నారా లోకేష్కు కూడా కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు మాట, రోజా తూటా
- 'మాకు అవకాశం ఉంటే నేను, వెంకయ్య అమెరికాలో పుట్టే వాళ్లం' అని చంద్రబాబు అన్నారని వీడియోను చూపించారు. దానికి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడు ఎవరు గుర్తుకు రాలేదు కానీ, వెంకయ్య గుర్తుకు వచ్చాడంటే ఆ అవిభక్త కవలలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఎలా తోడుగా ఉన్నారో తెలుస్తోందని ధ్వజమెత్తారు. వీళ్లిద్దరు కలిసి అమెరికాను ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించాలన్నారు.
- 'ఎస్సీలలో పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?' అని చంద్రబాబు వ్యాఖ్యానించారని వీడియో చూపించారు. దానిపై రోజు మాట్లాడుతూ.. తెల్లగా ఉంటే గొప్పోళ్లని అనుకోవడం దురదృష్టకరమన్నారు.
- 'కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా' అని చంద్రబాబు అన్నారని వీడియో చూపించారు. దీనిపై రోజా మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు కానీ, ఆడబిడ్డలంటే, భారతీయులు అంటే చంద్రబాబుకు ఎందుకు ఇంత అలుసు అన్నారు.
- 'ఎప్పుడో బ్రిటిషన్ వాళ్లు కట్టిపోయిన రైల్వే లైన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మన వాళ్లు కట్టిన హైవే వరదలకు తెగిపోయింది' అని చంద్రబాబు అన్నారని వీడియో చూపించారు. 'మన ఇంజినీర్లు ఎంత గొప్పవాళ్లు, ఎంత తెలివైన వాళ్లు అంటే.. వాళ్లకు కమిట్మెంట్ లేద'ని ఓసారి, 'మనవాళ్లకు ఇస్తే స్లమ్స్ కడతారు. మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయ'ని మరోసారి, 'మన ఇంజినీర్లకు కమిట్ మెంట్ లేదని, మన వాళ్లు కడితే బ్రిడ్జిలు తెగిపోతాయ'ని ఇంకోసారి చంద్రబాబు అన్నట్లుగా వీడియోలు చూపించారు. దీనిపై రోజా నిప్పులు చెరిగారు.
మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని, ఈయన (చంద్రబాబు) కోటీశ్వరుడు ఏం కాదని, రెండెకరాల నుంచి వచ్చారని, అంత అహంకారం ఎందుకని రోజా ప్రశ్నించారు. ప్రపంచంలో గొప్ప కట్టడాలు అన్ని భారతీయులే కడుతున్నారని, నాసాలో 50 శాతం మంది భారతీయ ఇంజినీర్లే ఉన్నారన్నారు. ఇంత నీచంగా మాట్లాడుతున్న చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. తెలుగు వారిని కించబరిచిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలన్నారు. దీనిని దేశద్రోహమని ప్రకటించాలని, చంద్రబాబును సీఎం పదవి నుంచి తీసేసి రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు.
- 'రైతులు నన్ను నమ్మలేదు. వరుణుడిని నమ్మారు.. అందుకే కరువు వచ్చింది' అని చంద్రబాబు అన్న వీడియోను చూపించారు. దీనిపై రోజా నిప్పులు చెరిగారు.
- 'అయ్యప్ప స్వాముల వల్ల నెల రోజుల పాటు లిక్కర్ అమ్మకాలు తగ్గిపోతున్నాయి' అని చంద్రబాబు అన్నారని వీడియో చూపించారు. దీనిపై రోజా మాట్లాడారు. చంద్రబాబు అందరికీ క్షమాపణ చెప్పాలని, ఆయన రాజీనామా చేసే వరకు వదలకూడదన్నారు.
- 'ఏ కులంలో ఉన్నా డబ్బులుంటే చాలు. గౌరవం ఉంటుంది. డబ్బు లేనప్పుడే రిజర్వేషన్ గుర్తుకు వస్తుంది.' అని చంద్రబాబు అన్నారని వీడియో చూపించారు. దీనిపై రోజా కౌంటర్ ఇచ్చారు. ఇంత నీచంగా మాట్లాడుతున్న చంద్రబాబును ఏం చేయాలన్నారు.
- 'నాకు ఇంగ్లీషు తెలియదంట. నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ, పీహెచ్డీ కూడా చేశాను' అని చంద్రబాబు అన్న వీడియోలు చూపించారు. రోజా మాట్లాడుతూ... పీహెచ్డి చేశానని అంటున్నారని, కానీ అప్లికేషన్ అయినంత మాత్రాన పీహెచ్డి చేసినట్లు కాదన్నారు. సీఎంగా ఉండి ఇలా పచ్చిగా అబద్దాలు చెబుతుంటే ఎెంత మోసం చేస్తున్నారో తెలుస్తోందన్నారు.
- నల్లధనంపై చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాయడంపై, హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి రూ.10వేల కోట్లు నల్లధనాన్ని వెల్లడించారని చంద్రబాబు చెప్పడంపై రోజా మండిపడ్డారు. నల్లధనం విషయం బాబుకు తెలిసిందంటే అది ఆయన డబ్బులు గానీ, బినామీ డబ్బు కానీ అయి ఉండాలన్నారు.
బాబు బ్లాక్ మనీకి బ్రాండ్ అంబాసిడర్ అని, చీటింగ్ను చీర్ గర్ల్లా ప్రమోట్ చేస్తారని, కమీషన్లకు ముద్దుబిడ్డ, కరప్షన్ కన్న బిడ్డ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దొంగతనాన్ని కప్పి పుచ్చేందుకు దేవినేని వంటి పెంపుడు పొలిటీషియన్లు తమను లాగుతున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు, కోడలు ఆస్తుల మీద విచారణ జరపాలన్నారు. వాళ్లకు సిగ్గు, లజ్జ ఉంటే జగన్ మీద చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు.