అండమాన్లో టిడిపి పోటీ: 'కోట్లు'తో ఆ స్థాయికి ఎదిగారని రోజా విసుర్లు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబర్ దీవుల్లో వచ్చే సెప్టెంబరులో జరగనున్న పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్ణయించడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు.
ఇక్కడ తెలుగు ప్రజలు కాబట్టి తెలుగు దేశం అని పేరు పెట్టారని, మరి మిగతా రాష్ట్రాల్లో ఏం పెడతారోనని రోజా ఎద్దేవా చేశారు. పుష్కరాలు, ఇసుక మాఫియా తదితరాల పేరుతో టిడిపి నేతలు కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారన్నారు. పదిహేను నెలల్లోనే వారు భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు.
అండమాన్ నికోబర్ దీవుల్లో టిడిపి పోటీ చేయాలని భావిస్తోందని, ఆ స్థాయికి వారు ఎదగారంటే వారు ఎన్ని కోట్లు గడించారో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ... తాము దోచుకున్న డబ్బులను మోడీ అడగకుంటే చాలనే విధంగా టిడిపి నేతల తీరు ఉందన్నారు.
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ వస్తే ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే లాభం అన్నారు. ప్రత్యేక హోదా, ఏపీకి నిధుల కోసం సిఎం చంద్రబాబు ప్రధాని మోడీని ఎన్నిసార్లు కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు అనుకూలమా, ప్రతికూలమా అని ప్రశ్నించారు.
ప్రధాని మోడీని కలిసినప్పుడు ఆయనతో ఏం మాట్లాడారనే విషయం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనల పైన తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా వస్తుందా? రాదా?, రాకుంటే ఎన్డీయేలో కొనసాగుతారా? చంద్రబాబు చెప్పాలన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే వైసిపికి లాభం కాదని, ఏపీ ప్రజలకు లాభమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29న దీక్ష చేస్తున్నారని, దానికి అందరూ మద్దతు పలకాలని కోరారు. తమ బందును అడ్డుకోవాలని చూసే వారు అభివృద్ధి నిరోధకులు అన్నారు.
కాగా, అండమాన్ నికోబర్ దీవుల్లో వచ్చే సెప్టెంబరులో జరగనున్న పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అండమాన్ నికోబర్ శాఖ అధ్యక్షులు మాణిక్ రావుతో భేటీ అయ్యారు.