నగరిలో రోజా ఓటమి .. ఏపీలో వైసీపీ విజయం .. రోజాను టెన్షన్ పెడుతున్న ఎగ్జిట్ పోల్స్
Recommended Video
ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు నగరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన రోజాకు టెన్షన్ మొదలయ్యింది. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుంది కానీ నగరిలో రోజా ఓడిపోతుంది అని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా భావించే ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా... నగరిలో ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి . లగడపాటి సర్వేతో పాటు... ఆరా అనే సంస్థ ఏపీ ఎన్నికల ఫలితాలపై చేసిన సర్వేలో రోజా ఓటమి తప్పదని తేలింది. ఆరా సర్వే ప్రకారం ఈసారి ఆమె ఓడిపోతారని కచ్చితంగా ప్రకటించింది. ఇక పార్టీలో ఉన్న కీలక నేతలే రోజాకు చెక్ పెట్టారని , స్థానిక నాయకత్వమే రోజాకు దెబ్బ కొట్టిందని ప్రచారం జోరుగానే సాగుతుంది. ఈ కొందరు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలే నగరిలో రోజా ఓటమికి కారణం అని కూడా తేల్చేసింది సర్వే ఫలితం.
జగన్ పై ప్రజల నమ్మకాన్ని వారి కళ్ళలో చూశాం .. ఫలితాలు నిరాశపరచవు అంటున్న రోజా
నగరిలో రోజాకు ఓటమి తప్పదు అంటున్న ఆరా ఎగ్జిట్ పోల్స్
రాజకీయాల్లో తనదైన మార్క్ వేసిన రోజా చిత్తూరు జిల్లాలో సొంత పార్టీ నేతలకు కొరకరాని కొయ్యగా మారింది. మొదటి నుండీ రోజాపై పార్టీ నేతల్లో ఉన్న అసహనం ఈసారి ఎన్నికల్లో ఆమెను దెబ్బ కొట్టి ఉండొచ్చని అటు రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మంత్రి పదవుల్ని ఆశిస్తున్న కొందరు సీనియర్ నేతలు... రోజా గెలిస్తే తమకు మంత్రి పదవి రేసులో పోటీ వస్తుందని ఆమె ఓటమికి ఎన్నికలకు ముందే ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది . దీంతో నగరిలో రోజాకు ఓటమి తప్పదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద లగడపాటి సర్వేతో పాటు ఆరా సర్వే కూడా నగరిలో రోజా ఓడిపోతున్నారనే తేల్చాయి .
ఎగ్జిట్ పోల్స్ పై అసహనం వ్యక్తం చేసిన రోజా ..ఎగ్జిట్ పోల్స్ను గుడ్డిగా నమ్మలేమన్న రోజా
దీంతో ఇప్పుడు రోజా గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మధ్య ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్ అయిన రోజా ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా నోరు విప్పారు. కానీ ఆమె మాటల్లో కాసింత టెన్షన్ కనిపించింది. ఒక పక్క వైసీపీ విజయం సాధిస్తుంది అని సంతోషం వ్యక్తం చెయ్యాలో మరో పక్క తాను ఓడిపోతున్నానని చెప్పినందుకు బాధ పడాలో అర్ధం కాని సందిగ్ధ స్థితిలో రోజా మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ను గుడ్డిగా నమ్మలేమన్నారు. తన వరకు అయితే ఇలాంటి సర్వేలను నమ్మనని తేల్చేశారు. వైసీపీ గెలుస్తుందని దాదాపు చాలా సర్వేలు వెల్లడించినా ఆమె నమ్మనని చెప్పటానికి కారణం ఆమె ఓడిపోతుందని సర్వేలు వెల్లడించటమే .
రోజా మంత్రి ఆశలు గల్లంతేనా ? టెన్షన్ లో నగరి ఎమ్మెల్యే రోజా
పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల ఆమెను ఎగ్జిట్ పోల్స్ భయం వెంటాడుతుందని భావిస్తున్నారు రాజకీయ నిపుణులు. 2004లో నగరి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రోజా 2009లో ఓటమి తర్వాత వైఎస్ బతికి ఉండగానే కాంగ్రెస్లోకి చేరిపోయారు. గత ఎన్నికల్లో కూడా నగరి నుంచి పోటీ చేసిన రోజా.. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై గెలుపొందారు. వైఎస్ మరణాంతరం వైసీపీలోకి వెళ్లడంతో పాటు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయడంతో జగన్ గత ఎన్నికల్లో ఆమెకు నగరి నుండి మరోమారు అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి రోజా గెలిస్తే మహిళా కోటాలో మంత్రిగా అవకాశం ఇస్తారని జోరుగానే ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా రోజా ఆశలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్ళు చల్లింది. దీంతో రోజా ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.