స్పీకర్కు రోజా హెచ్చరిక: లోకేష్ వెయిటింగ్.. కేబినెట్ విస్తరణ వాయిదా.. కారణమిదీ!
గొళ్లపాడు సర్పంచ్ కుమారి విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం అన్నారు. ఈ విషయమై స్పీకర్ కోడెల శివప్రసాద రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గుంటూరు: గొళ్లపాడు సర్పంచ్ కుమారి విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం అన్నారు. ఈ విషయమై స్పీకర్ కోడెల శివప్రసాద రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేదంటే సర్పంచ్ కుమారి విషయంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని రోజా హెచ్చరించారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధులను నిర్బంధించడం హేయమన్నారు. రాష్ట్రంలో అటవిక పాలన సాగుతోందన్నారు.
మహిళా సాధికారత సభ జరిగిన చోటే ఎస్టీ సర్పంచిని అవమానించారన్నారు. ఎస్సీ, ఎస్టీలను అధికార పార్టీ నేతలు అవమానిస్తున్నారని మరో వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కేస్తున్నారన్నారు.
మంత్రివర్గ విస్తరణ ఉగాది అనుకున్నా...
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉగాది పర్వదినం రోజున చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు తొలుత భావించారు. అయితే సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటాలో లోకేష్ ఎమ్మెల్సీగా ఇటీవలె ఎన్నికయ్యారు. అయితే ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రస్తుతం పదవీ విరమణ చేయాల్సిన ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29 వరకు ఉంది. వారంతా అప్పటి వరకు ఎమ్మెల్సీలుగా ఉంటారు.
వారి పదవీ కాలం ముగిసిన తర్వాత మాత్రమే లోకేష్, ఆయనతో పాటు ఎన్నికైనన మిగతా సభ్యులు ఎమ్మెల్సీలు అవుతారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సమావేశాలు ముగిశాక కేబినెట్ విస్తరణ చేస్తే మంచిదని చంద్రబాబు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. దీంతో ఉగాది ముహూర్తం వాయిదా పడింది. ఏప్రిల్ 6వ తేదీన విస్తరణ ఉంటుందంటున్నారు.