వారు తెలుగు తల్లిని చంపారు: రోజా, జగన్ ఒక్కరే
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రోజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు తెలుగుతల్లిని హత్య చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన కిరణ్, బాబు వల్లే జరిగిందని రోజా ఆరోపించారు. విభజనకు సహకరించి ప్రజలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. చివరి బంతి వరకూ పోరాడుతానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని రోజా విమర్శించారు.
సమైక్య రాష్ట్రం కోసం పోరాడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరినే రోజా అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని రోజా తెలిపారు.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన వైయస్సార్ జనభేరిలో భాగంగా శనివారం ఆయన చిత్తూరు జిల్లాలోని తిరుపతికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం తిరుమలకు చేరుకుని రోడ్ షో నిర్వహించారు