తప్పులో కాలేసిన రోజా: సాక్షి మీడియానే కారణమా?
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్పై వ్యాఖ్యలు చేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆమె తప్పులో కాలేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్పై వ్యాఖ్యలు చేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆమె తప్పులో కాలేశారు. నిజానిజాలను తేల్చకోకుండా వ్యాఖ్యలు చేయడం వల్లనే ఆమెకు ఈ స్థితి వచ్చి పడింది.
స్పీకర్ మాక్ పోలింగులో పాల్గొన్నారని అంటూ ఎందుకీ దిగజారుడుతనమని ఆమె ప్రశ్నించింది. స్పీకర్ మాక్ పోలింగులో పాల్గొన్నారా లేదా అనేది తేల్చుకోకుండా ఆమె వ్యాఖ్యలు చేయడమే చిక్కులు కల్పించింది.
రోజా తప్పుడు వ్యాఖ్యలు చేసి స్పీకర్ గౌరవాన్ని దెబ్బ తీసినందుకు ఆమెకు క్రమశిక్షణ నోటీసులు అందాయి. చర్యలు తీసుకోవడానికి స్పీకర్ సిద్ధపడ్డారు.
సాక్షి మీడియా సమాచారం....
స్పీకర్ కోడెల శివప్రసాద రావు మాక్ పోలింగులో పాల్గొన్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం కార్యాలయం నుంచి సాక్షి మీడియా ప్రతినిధులకు సమాచారం అందినట్లు చెబుతున్నారు. ఆమె కావాలని చెప్పినట్లు కాకుండా ప్రశ్న వేయాలని కూడా వారికి సూచనలు అందాయని అంటున్నారు.
Recommended Video
రోజా ఆలోచించకుండా....
సాక్షి మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. అంతే, ఏ మాత్రం వెనకాముందూ ఆలోచించకుండా రోజా స్పీకర్పై వ్యాఖ్యలు చేశారు. సాక్షి మీడియా వాళ్లు అడిగారు కాబట్టి అది అధిష్టానం ఆదేశమై ఉంటుందని రోజా స్పీకర్పై తనదైన శైలిలో దూకుడుగా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
కోతికి కొబ్బరికాయ దొరికినట్లు...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నోటికి పని చెబుతూ తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడే రోజా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు సంతోషించి రంగంలోకి దిగారు. వెంటనే నోటీసులు జారీ చేయడం జరిగిపోయింది.
అసలేం జరిగింది...
ముఖ్యమంత్రి కార్యాలయం పక్కనే ఉండే గదిలో రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ జరిగింది. ఆ మాక్ పోలింగ్ కేవలం టిడిపి ఎమ్మెల్యేలకు మాత్రమే జరగలేదు. అది టిడిఎల్పీ కార్యాలయం కూడా కాదు. అక్కడ స్పీకర్ పాల్గొంటే తప్పేమీ లేదనే విషయాన్ని సాక్షి మీడియా గానీ, వైసిపి శాసనసభా పక్షానికి చెందినవారు గానీ తెలుసుకోలేకపోయారు. రోజా వ్యాఖ్యలు చేయడానికి సమయం కూడా తీసుకోలేదు. స్పీకర్ మాక్ పోలింగులో పాల్గొంటే తప్పేమీ లేదని తెలుసుకోలేకపోవడమే రోజా చేసిన తప్పు అని నిపుణులు అంటున్నారు.
గతంలో ఇలా..
గతంలో సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ శాసనసభ స్పీకర్లుగా పనిచేసినా వారెప్పుడూ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకోలేదని, ఈ స్పీకర్ మాత్రం సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో టీడీపీ కండువాలు వేసుకున్నారని, ఆయన ఒక పార్టీ మనిషిగా శాసనసభలో తమ గొంతు నొక్కే ప్రమాదం ఉందని ఆయనిలా దిగజారి ప్రవర్తించడం సరికాదని రోజా.
టీడిఎల్పీ కాదు...
స్పీకర్ కోడెల శివప్రసాద రావు టిడిఎల్పీ కార్యాలయానికి వెళ్లారని రోజా చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత ఆయన ఆ కార్యాలయంలో అడుగు కూడా పెట్టలేదు. సీఎంవోలో ఎమ్మెల్యేలకు నమూనా పోలింగ్ జరుగుతున్నప్పుడు అదెలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమే ఆయన వెళ్లారు.