అందుకే చివరి రోజు వచ్చా, బాబుకు అత్తారి ఊరిపై మోజు: రోజా
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని దేవుడిని ప్రార్థించినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు రోజా తెలిపారు. కృష్ణాపుష్కరాల చివరిరోజు మంగళవారం శ్రీశైలం డ్యాం దిగువన లింగాలగట్టు లోలెవల్ పుష్కరఘాట్ వద్ద రోజా కుటుంబసభ్యులతో కలిసి పుష్కరస్నానం చేశారు.
కృష్ణవేణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రోజా భర్త సెల్వమణి పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అంతకుముందు పష్కరఘాట్ వద్ద రోజా మీడియాతో మాట్లాడారు. పుష్కరాల మధ్యలో వచ్చి భక్తులను ఇబ్బందులు పెట్టకూడదని చివరిరోజున వచ్చానని చెప్పారు. గోదావరి పుష్కరాల్లో కుటుంబసభ్యులతో కలిసి స్నానం చేశామని, కృష్ణాపుష్కరాలకు కూడా కుటుంబంతో కలిసి వచ్చామని తెలిపారు.
జ్యోతిర్లింగ క్షేత్రం, అష్ఠాదశశక్తి పీఠం కొలువైన శ్రీశైలంలో ఏది కోరుకున్న జరిగితీరుతుందని భక్తుల నమ్మకమని, అందుకే శ్రీశైలంలో పుష్కరస్నానం చేశానని తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే ప్రభుత్వాలపై నమ్మకం లేదని, దీంతో రాష్ట్రం బాగుకోసం భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు.
అత్తగారి మీద, అత్తగారి ఊరు మీద ముఖ్యమంత్రికి ఎంత మోజు ఉందో రాజధాని ఏర్పాటుతోనే అర్థమయిందని విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా చూడాల్సి ఉండగా కృష్ణాజిల్లాలోనే అభివృద్ధి మొత్తం చేస్తున్నారని, గతంలో ఇలాగే హైదరాబాద్లో చేసి నష్టపోయామని ఆమె అన్నారు.
గోదావరి పుష్కరాల మాదిరే కృష్ణాపుష్కరాలు కూడా ప్రచారం కోసం చేస్తున్నారని, భక్తిభావంతో చేసేవారైతే గుడులను, గోపులరాలను ఎందుకు కూల్చుతారని ప్రశ్నించారు. వాటిస్థానంలో బాత్రూంలను కడుతున్నారంటే ఎంత అహంకారమో ఇట్లే అర్థమవుతోందన్నారు.