బోరున ఏడ్చిన ఎమ్మెల్యే రోజా .. తననెవరూ పట్టించుకోవటం లేదని ప్రివిలేజ్ కమిటీ ముందు కన్నీటి పర్యంతం
నగరి ఎమ్మెల్యే రోజా తమ నియోజకవర్గ సమస్యల విషయంలో , అలాగే ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నగరి ఎమ్మెల్యే రోజా బోరున విలపించారు. ఇక టిటిడి లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆమె శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఎంతమందికి చెప్పుకున్నా, ఎన్ని కమిటీలు వచ్చినా తన సమస్య పరిష్కారం కావడం లేదని, తననెవరూ పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే రోజా లబోదిబోమంటున్నారు.
చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ .. మతరాజకీయలు చేస్తే పతనం తప్పదు
ప్రజా ప్రతినిధిగా కనీస గౌరవం ఇవ్వటం లేదని రోజా కన్నీళ్లు
ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ సహా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసిన రోజా, ఒక ప్రజాప్రతినిధిగా తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరిలో జరిగిన టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమావేశానికి తనను ఆహ్వానించలేదని అధికారులు తనకు తెలియకుండానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందు నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తిరుపతిలో ప్రివిలేజ్ కమిటీ విచారణ ... ప్రోటోకాల్ పాటించటం లేదని రోజా ఆవేదన
రోజా విషయంలో అధికారుల తీరు రోజా ఎన్ని మార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా మారటం లేదు . ప్రోటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలకు పిలవకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోజా ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేయగా, ఈరోజు తిరుపతిలో ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. ఇక ఈ విచారణలో అనేకమార్లు ప్రభుత్వ అధికారులు తనను నిర్లక్ష్యం చేసి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రోజా కమిటీ ముందు ఆవేదన వెలిబుచ్చారు. శాసనసభ్యురాలిగా ప్రోటోకాల్ ప్రకారం అన్ని సవ్యంగా జరిగేలా చూడాలని ఆమె కమిటీని కోరారు.
రోజా ఫిర్యాదులపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్
ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని రోజా ఫిర్యాదు చేసిన మేరకు ఆమె చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్ని విషయాలను జిల్లా కలెక్టర్ కు చెప్పామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారని పేర్కొన్నారు. రోజా అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను కూడా కమిటీ ముందు నివేదించారు అని, అవి తమ పరిధిలో లేనప్పటికీ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి.
అధికార పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు రోజా కన్నీటికి కారణమా ?
స్థానికంగా అధికార పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు నగరి ఎమ్మెల్యే రోజా కన్నీటికి కారణమని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక మార్లు గ్రూప్ రాజకీయాల విషయంలో రోజా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక సమయంలో కూడా రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ చైర్మన్ గా కేజే శాంతిని నియమించటం రోజాకు ఆగ్రహం తెప్పించింది. కావాలనే తనకు ప్రాధాన్యత లేకుండా సొంతపార్టీ నేతలే చేస్తున్నారని అధిష్టానం ముందు లబోదిబోమన్నారు.
భవిష్యత్ లో అయినా రోజాకి తగిన ప్రాధాన్యత దక్కుతుందా ?
గతంలో కూడా రోజా మంత్రులు కావాలని తమ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి లపై అనేక సందర్భాలలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . అధికారుల నిర్లక్ష్యం వెనుక సొంత పార్టీ నేతలు , మంత్రులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రివిలేజ్ కమిటీ జోక్యం చేసుకుని, అధికారులకు ఆదేశాలు జారీ చేసినా, అధికార పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో రోజా కు తగిన ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్న ఆసక్తికర చర్చ స్థానికంగా జరుగుతుంది .