మాజీ కలెక్టర్తో కలిసి మార్చానా, అలా డబ్బు సంపాదించా: గాలిపై రోజా సంచలన వ్యాఖ్యలు
Recommended Video
చిత్తూరు: టిడిపి నేత, శాసన మండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం పుత్తూరులో నిప్పులు చెరిగారు. గాలి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. మాజీ కలెక్టర్ సిద్ధార్థ జైన్తో కలిసి హంద్రీనీవా ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చానని గాలి ముద్దు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ తన నిజాయితీ గురించి అసెంబ్లీ రికార్డులు పరిశీలించాలని చెప్పారని, కానీ రికార్డుల్లో ప్రజా సమస్యలపై మాట్లాడిన విషయాలు తప్ప నీతి నిజాయితీలు ఉండవని ఎద్దేవా చేశారు.
బాబు నాకు ఎలా అంటే, ఆ రోజు అందుకే విమర్శించా, ఫోన్ చేశానని తెలిస్తే చాలు: శివప్రసాద్
సూటుకేసు పట్టుకొని వచ్చి కోట్లు సంపాదించలేదు
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా సుమారు 150 సినిమాల్లో నటించి నిజాయితీగా డబ్బు సంపాదించానని రోజా అన్నారు. గాలి ముద్దుకృష్ణమలా తాను లెక్చరర్ ఉద్యోగం చేస్తూ సూటుకేసు చేతిలో పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేదన్నారు.
తిరుమల దర్శనం టిక్కెట్లు అమ్మేసుకుంటున్నారు
గాలి ముద్దుకృష్ణమ తిరుమల దర్శనం టిక్కెట్లు కూడా అమ్ముకునే వ్యక్తి అని రోజా సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ తన లేఖపై రోజుకు ఎంతమందికి దర్శనం ఇప్పిస్తున్నారనే విషయం బయట పెట్టాలన్నారు. రూ.45 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వాకింగ్ ట్రాక్గా మారిపోవడానికి ఆయనకున్న ధన వ్యామోహమే కారణం అన్నారు.
అందుకు బదులు తిరుపతిలో ఇళ్లు గిఫ్ట్
గాలి ముద్దుకృష్ణమ అనుచురులు దోచుకుంటున్నారని రోజా అన్నారు. వడమాలపేట టోల్ ప్లాజా నిర్వాహకులు సక్రమంగా రోడ్డు నిర్మించకపోయినా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇందుకు గాను గాలికి తిరుపతిలో ఇళ్లు నిర్మించి బహుమతిగా ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. గాలి, ఆయన కొడుకు అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.
మున్సిపల్ స్థలాల పేరుతో దోపిడీ
పాతబస్టాండు వద్ద దుకాణాల లీజు పేరుతో మున్సిపల్ స్థలాలను టీడీపీ నాయకులకు అప్పనంగా దోచిపెట్టారని రోజా మండిపడ్డారు. దుకాణాలను తొలగించకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.