శంకర్దాదా ఎంబీబీఎస్: రోజా, తెలివైనవాడిని కాబట్టే: బాబు ఆసక్తికరం
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దోమల పైన దండయాత్ర కార్యక్రమం విషయంలో మంత్రుల తీరుపైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శనివారం నాడు మండిపడ్డారు. నగరి మున్సిపాలిటీలో దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. ప్రజలు అనారోగ్యంతో అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ప్రభుత్వం తీరు దొంగలుపడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. డెంగీ, విష జ్వరాలతో జనం ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొందన్నారు.
వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చుట్టు తిరగడానికే సమయం సరిపోతోందన్నారు. అనంతపురంలె డెంగీతో చనిపోతే మంత్రి వెళ్లి చూడలేదన్నారు. ఆయన నిజమైన డాక్టరా లేక 'శంకర్ దాదా ఎంబీబీఎస్' లాంటి డాక్టరా అనే సందేహం కలుగుతోందన్నారు.
చిత్తూరు జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ నగరి నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు కనీసం అడుగు పెట్టలేదన్నారు.
పారదోలండి అంటే దోమలు పారిపోవని, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసి, తగిన సిబ్బందిని నియమించాలన్నారు. దోమలపై దండయాత్ర అంటూ ర్యాలీలు చేయడంతోనే దోమలను అరికట్టలేమన్నారు. మంత్రులుగా ఫెయిల్ అయిన కామినేని, నారాయణలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు.
కాగా, ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేయలేరని, తెలంగాణ ప్రభుత్వం తన పైన కేసు పెట్టలేదని చెప్పారు. తన పైన విపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తాను చాలా తెలివైన వాడినని, అందరికంటే సీనియర్ నాయకుడిని అని, అందుకే ఏపీ ప్రయోజనాల దృష్ట్యా మంచి ప్యాకేజీని అంగీకరించానని చెప్పారు.