దుమారం: జగన్ చెప్తే సత్తా చూపిస్తామంటూ బాబుపై రోజా నిప్పులు
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు అవకాశం ఇస్తే తమ సత్తా ఏమీటో చూపిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా సోమవారం అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం రోజా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లోనే తనను దుర్భాషాలాడారని మండిపడ్డారు. వీడియో క్లిప్ చూస్తే తనను దూషించే ముందు బుచ్చయ్య ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారని చెప్పారు. చంద్రబాబు సభా సంప్రదాయాలను మంటకల్పుతున్నారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యుల సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పైన సభా హక్కుల నోటీసు ఇస్తామని హెచ్చరించారు. జగన్ అవకాశమిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని రోజా విలేకరుల ఎదుట చెప్పారు. అధికార పక్షం భయపెట్టాలని చూస్తోందన్నారు.
మహిళ అని కూడా చూడకుండా టీడీపీ సభ్యులు దిగజారుడు వ్యాఖ్యలు, దుర్భాషాలాడారని మండిపడ్డారు. మహిళ పైన అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనమన్నారు. గోరంట్ల తన వయస్సుకు తగినట్లుగా వ్యవహరించడం లేదన్నారు. మహిళ అనే గౌరవం లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడమేమిటన్నారు.
కాగా, అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే రోజా పైన మండిపడ్డ విషయం తెలిసిందే. రోజా లేడీ విలన్లా ప్రవర్తిస్తున్నారన్నారు. సభలో తనకు జరిగిన అవమానంపై మాట్లాడందుకు అవకాశమివ్వాలని రోజా కోరినా సభాపతి అనుమతించలేదు. దీంతో ఆమె కంటతడి పెట్టారు.