మేo ఎస్టీ, ఎస్టీలం కాము: రోజా వివాదాస్పద వ్యాఖ్య
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై ఒక మహిళా ఎమ్మెల్యే ధర్నా చేస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా వచ్చి సమాధానం చెప్పకపోవడం దారుణమని, తామేమీ ఎస్సీ, ఎస్టీలం కాదు దగ్గరకి రండని ఆమె ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లా పుత్తూరు ఎంపీపీ మాధవయ్య అధ్యక్షతన శుక్రవారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని భగ్నం చేయడానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సీఐ సాయినాథ్.. కేవలం మండల సభ్యులు మాత్రమే లోపలికి వెళ్లాలంటూ గేటు వద్దనే వైసీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో కౌన్సిలర్, మాజీ ఎంపీపీ ఏళుమలై సీఐతో వాగ్వాదానికి దిగారు.
తాము మండల అధికారులతో సమస్యలు చెప్పుకోవడానికి శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామన్నారు. అయినా సీఐ అంగీకరించలేదు. ఈలోపు ఎమ్మెల్యే రోజా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమెతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని అధికారుల, ఎంపీపీ తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో సమావేశం ప్రారంభం కాలేదు.
అధికారులంతా ఎంపీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా రోజా ఆరోపించారు. టీడీపీ నాయకులు చెరువులు ఆక్రమించుకుని రియల్ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నా, సదాశివ ఆలయ భూములు ఆక్రమించుకుని వ్యాపారాలు చేసుకుంటున్నా తహసిల్దార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ ఆదేశాల ప్రకారం పని చేస్తున్నారని ఆరోపించారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఉద్దేశించి దగ్గరకు రావలసిందిగా రోజా పిలవగా.. ఆయన, అక్కడే నిలబడి ‘చెప్పండి మేడమ్' అన్నారు. దీంతో రోజా ఆగ్రహంగా.. ‘మేమేమీ ఎస్సీ ఎస్టీలం కాదు, దగ్గరకు రండి' అన్నారు. ఆ వ్యాఖ్యలు వినగానే అక్కడే ఉన్న దళితులు, టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఆమె ప్రసంగానికి అడ్డుతగిలి ‘రోజా డౌన్ డౌన్, దళిత ద్రోహి రోజా' అంటూ ఆగ్రహంగా నినాదాలు చేశారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి రోజాను వెళ్లనీయకుండా ఆమె వాహనాన్ని అడ్డుకుని క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.
వారికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఏంపీడీవో కార్యాలయం దద్దరిల్లిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలవారినీ అదుపులోకి తీసుకున్నారు.