నారావారిలో వణుకు, లోకేష్ వార్డు సభ్యుడిగా గెలవలేడు: రోజా
చిత్తూరు: ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రలో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగూ నారా వారి నరాల్లో వణుకు పుట్టిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం చిత్తూరు జిల్లాలోని నగరిలో సాగింది.
అడుగడుగునా పేద ప్రజల కన్నీల్లు తుడుస్తూప్రజా సంకల్ప యాత్ర ద్వారా వస్తున్న మన అన్న. రాజన్న ముద్దు బిడ్డ.. జగనన్నకు నగరి నియోజకవర్గంలకి స్వాగతం, సుస్వాగతం అని ఆమె చెప్పారు.
ప్రతి అడుగూ టిడిపి గుండెల్లో గునపమై...
ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రలో జగనన్న వేసే ప్రతి అడుగూ టీడీపి గుండెల్లో గునపమై దిగుతోందని రోజా వ్యాఖ్యానించారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో, రాబోయే ఎన్నికల్లో జగనన్న గెలవడం అంతే నిజమని ఆమె అన్నారు.
అది మన అదృష్టం..
పాదయాత్రలో జగనన్నతో కలిసి అడుగులు వేయడం మనం చేసుకున్న అదృష్టమని రోజా అన్నారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర ఓ చరిత్ర అని, నేడు జగనన్న పాదయాత్ర ఆధునిక చరిత్ర అని ఆమె అన్నారు. జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడే తమ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు.
మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు..
రాష్ట్రంతో పాటు నగరి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని రోజా అన్నారు. వైఎస్ రైతు బాంధవుడిగా పేరు సంపాదించుకున్నారని, ప్రతిపక్షం అధికారంలో ఉన్న జిల్లా అయినప్పటికీ పెద్ద మనసుతో గాలేరు నగరి ప్రాజెక్టును ప్రారంభించారని, ఈ రోజు చిత్తూరు జిల్లా ప్రజలు అందరూ సంతోషించారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో ఖర్చు చేసారని, మధ్యలో మనల్ని వైఎస్ వెళ్లిపోయారని ఆమె అన్నారు.
చంద్రబాబు సిగ్గుతో తల వంచుకోవాలి...
వైఎస్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ప్రాజెక్టుకు ఏదో విదిలించారని రోజా చెప్పారు. 65 శాతం పూర్తయిన ప్రాజెక్టులో మిగిలిన 35 శాతాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని ఆమె అన్నారు. చంద్రబాబు గాలేరు నగరి ప్రాజెక్టును సమాధి రాయిగా మార్చారని వ్యాఖ్యానించారు. మొన్ననే గాలేరు నగరి ప్రాజెక్టు సాధన కోస నాలుగు రోజుల పాటు 88 కిలోమీటర్ల పాదయాత్ర చేశామని అన్నారు.
తీపిని చేదుగా మార్చారు...
వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టు జగనన్న చేతుల మీదుగా ప్రారంభం కావాలని రోజా అన్నారు ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు చిత్తూరు ప్రజల నోట్లోని తీపిని చేదుగా మార్చారని పంచదార పరిశ్రమల మూసివేతను ఉద్దేశించి అన్నారు రేణిగుంట పంచదార కర్మాగారం వద్ద ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే రెండు సార్లు బకాయిలు ఇచ్చారని, కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు రోడ్డు మీదికి తెచ్చారని ఆమె అన్నారు.
నారా లోకేష్పై వ్యాఖ్య
జాబు కావాలంటే బాబు రావాలని, బాబు వస్తేనే జాబు వస్తుందని అంటూ చంద్రబాబు యువతను మోసగించారని రోజా అన్నారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని అన్నారు. లక్షా నలబై వేల ఉద్యోగాలు ఉంటే కనీసం ఒక్కటి కూడా భర్తీ చేయలేదని ఆమె అన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని నారా లోకేష్ను చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిలో కూర్చోబెట్టారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలపై కన్నా చంద్రబాబుకు లోకేష్పైనే ఎక్కువ ప్రేమ ఉందని వ్యాఖ్యానించారు.
ఇద్దరికే రుణపడి ఉంటా..
తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఇద్దరికే రుణపడి ఉంటానని రోజా అన్నారు. పార్టీ తరఫన సీటు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి, తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు మీ వెంటే ఉంటానని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ప్రజల కోసం పోరాడే నాయకుడు జగనన్న ఒక్కడే అని ఆమె అన్నారు.