ప్రభుత్వం షరతు, అవకాశం: రోజా మెట్టు దిగుతారా?
హైదరాబాద్: తనపై విధించిన సస్పెన్షన్ వేటు నుంచి బయటపడడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఓ మెట్టు దిగుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల మాటల తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆమె ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపిస్తారని వారు చెప్పారు.
రోజా వ్యవహారంపై సోమవారం ఆంధ్రప్రదేశ్ శానససభలో చర్చ జరిగింది. ప్రివిలెజెస్ కమిటీ ముదు హాజరు కావడానికి రోజాకు మరో అవకాశం ఇస్తూ చర్చ ముగిసిన తర్వాత సభ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని రోజా వాడుకుంటారని వైసిపి ఎమ్మెల్యేలు చెప్పారు.
రోజా క్షమాపణ చెప్తే సస్పెన్షన్ను ఉపసంహరిస్తామని అధికార తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. రోజా క్షమాపణ చెప్తే చాలునని హైకోర్టులో కూడా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయాధికారి చెప్పారు. ఈ స్థితిలో రోజా వ్యవహారంపై చర్చ జరిగినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు సోమవారం సభను బహిష్కరించారు.
తాము లేనప్పుడు రోజాను, కొడాలి నానిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారనే వాదన రాకుండా చూసుకుంటూ తాము ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించామని చోటుకుంటూ ప్రభుత్వం కొడాలి నానిపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరు కావడానికి రోజాకు మరో అవకాశం ఇచ్చింది.
రాజకీయంగా ఎదుర్కోలేకనే రోజాపై తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత వేధింపులకు పాల్పడుతోందని వైసిపి ఎమ్మెల్యేలు విమర్శించారు. రోజా రేపు ప్రివిలెజెస్ కమిటీ ముందు హాజరు కావచ్చునని కూడా చెబుతున్నారు. అధికారం ఉంది కదా అని రోజాను నిబంధనలకు విరుద్ధంగా సభ నుంచి సస్పెండ్ చేశారని వారు ఆరోపించారు.
రోజాకు అనుకూలంగా తీర్పు వచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదని, ఆ రకంగా న్యాయస్థానాలను కించపరిచిందని వారు విమర్శించారు. పైగా, సారీ చెప్తే క్షమించే అవకాశం ఉందని చెప్పడం దురదృష్టకరమని వారన్నారు. రోజా చాలా బాధపడుతున్నారని, మహిళను ఈ విధంగా వేధిస్తున్నారనేది ఆమె ఆవేదన అని వారన్నారు. రోజా షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ పడిపోయాయని వారు చెప్పారు.
ఇదిలావుంటే, సోమవారం జగన్ అధ్యక్షతన వైయస్సార్ కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం రోజా వ్యవహారంపై చర్చించింది. అయితే, రేపు మంగళవారం సభకు హజరయ్యేది, లేనిదీ తేల్చలేదు. ఈ విషయంలో జగన్ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. తన పార్టీ శాసనసభ్యులకు తన నిర్ణయాన్ని చెప్పలేదు.