రేపు రోజా అసెంబ్లీ ఎంట్రీకి నో: గేట్ వద్దే అడ్డుకోవడానికి మార్షల్స్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు హైకోర్టు అనుమతించినప్పటికీ, ఆమెను లోనికి అడుగుపెట్టనివ్వకూడదని అసెంబ్లీ వర్గాలు నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ గేట్ వద్దనే రోజాను నిలిపివేయాలని మార్షల్స్కు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి. రేపు (శుక్రవారం) రోజా శాసనసభకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశద్వారం వద్దే ఆమెను నిలువరించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాజ్యాంగ, న్యాయ నిపుణులతో ఏపీ ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అసెంబ్లీలో రోజా ప్రవర్తన, ఆమె చేసిన వ్యాఖ్యలపై అవసరమైతే కోర్టులో అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అసెంబ్లీ అధికారులు న్యాయస్థానం తీర్పు ఉన్నప్పటికీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం రాత్రి మీడియాలో వార్తలు వచ్చాయి.
ఏపీ సెక్రటేరియట్లో స్ట్రాటజీ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప హాజరయ్యారు. రోజా వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రోజా కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును కమిటీ పరిశీలించింది.
తీర్పులో సెక్షన్ 340 (2) ప్రకారం చేయడాన్ని మాత్రమే కోర్టు తప్పుపట్టిందని నేతలు భావించారు. రాజ్యాంగంలోని 212 నిబంధన ప్రకారం అసెంబ్లీ వ్యవహారాల్లో తాము జోక్యచేసుకోలేమన్న విషయాన్ని కూడా తీర్పులో కోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. ప్రివిలైజ్ కమిటీ రోజాపై తదుపరి చర్యలు తీసుకోవాలనుకుంటే దానికి ఈ తీర్పు అడ్డుకాబోదని కూడా తీర్పులో స్పష్టం చేశారని కమిటీ సభ్యులు తెలిపారు.