హైకోర్టును రోజా తప్పుదారి పట్టించారా: ఆర్డర్ కాదా.. ఎవరేమంటున్నారు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా హైకోర్టును తప్పుదారి పట్టించారా? అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవునని అంటున్నారు. కోర్టువి ఆదేశాలు కాదని, సూచన మాత్రమేనని చెబుతున్నారు.
సభలో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం సూచనల మేరకు.. హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రోజా ప్రవర్తనను తప్పుబడుతూనే, ఆమె పైన 340 (2) ప్రకారం ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొంది. ఆమెను ఒక సెషన్కే పరిమితం చేయాలని చెప్పింది.
ఈ ఆర్డర్ కాపీతో రోజా శుక్రవారం నాడు అసెంబ్లీకి వచ్చారు. ఆమెను టిడిపి సభ్యులు అడ్డుకున్నారు. అయితే, తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం తప్పని కోర్టు చెప్పినప్పటికీ, ఎందుకు సభకు రానివ్వడం లేదని రోజా, వైసిపి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పు పట్టిందని చెబుతున్నారు.
అయితే, దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. హైకోర్టును రోజా తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. కోర్టు.. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టలేదని అంటున్నారు. కేవలం 340 (2)ని సరి చూసుకోవాలని మాత్రమే చెప్పారని అంటున్నారు. అది సూచన మాత్రమేనని, ఆదేశం కాదంటున్నారు.
అలాగే రోజా.. కోర్టులో కేవలం రూల్ను మాత్రమే చెప్పారని, సభలో తన ప్రవర్తనను చెప్పలేదని అంటున్నారు. హైకోర్టు తీర్పు పైన సభలో చర్చ జరగాలని, ఆ తర్వాత సభ నిర్ణయాన్ని హైకోర్టుకు తెలపవలసి ఉంటుందని చెబుతున్నారు. చర్చ జరగకుండా తీర్పు ఉల్లంఘన ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మధ్యంతర ఉత్తర్వులను పట్టుకొని హైకోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సరికాదంటున్నారు. అదే సమయంలో రోజా తీరును హైకోర్టు ఆక్షేపించిందన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే అనిత పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రోజా చేసిన ఘాటు వ్యాఖ్యల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైసిపి మాత్రం కోర్టు ఆదేశాలు ప్రభుత్వం పాటించడం లేదని మండిపడుతోంది. కోర్టు ఆదేశాలతో తనకు అసెంబ్లీకి హాజరయ్యే హక్కు ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం తనను ఏ సెక్షన్ కింద ఏడాది సస్పెండ్ చేసిందో, అది తప్పని హైకోర్టు చెప్పిందని అంటున్నారు.