దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకైంది! కేసీఆర్ కాళ్లు పట్టుకున్నావు: బాబుపై రోజా, మిథున్ సంచలనం
నెల్లూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లా రేణమాలలో జరిగిన మహిళల ముఖాముఖి కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు రోజా, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా కుంభకర్ణుడిలా నిద్రపోయిన చంద్రబాబునాయుడు.. అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు తమ పార్టీ ఎంపీలతో నాటకాలాడిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఒక్కసారి రాష్ట్రానికి వచ్చి వెళ్లారని.. అయితే ఆయన ఏపీకి ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని ఆరోపించారు.
అడుక్కునే పరిస్థితికి..
కేంద్రం వద్ద రాష్ట్రాన్ని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా కేంద్రాన్ని జగన్ నిలదీస్తున్నారని చెప్పారు. కాగా, చంద్రబాబు ఇప్పటికీ కబ్జా చేసిన ఇంట్లోనే ఉంటున్నారని అన్నారు.
Recommended Video
టీడీపీ నేతలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంకైంది..
ఎంపీల రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని జగన్ వదలడంతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంకైందని రోజా ఎద్దేవా చేశారు. ఐదు సార్లు ఓడినా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బుద్దిరాలేదని అన్నారు. పనిపాట లేకుండా పాదయాత్ర చేస్తున్నారని జగన్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పుడు మీ జిల్లాలోనే ఉన్నారు... దమ్ముంటే ఇక్కడికి రావాలని సోమిరెడ్డికి రోజా సవాల్ విసిరారు.
కేసీఆర్ కాళ్లు పట్టుకోవడమే..
ఓటుకు నోటు కేసుతో.. చంద్రబాబు గోడ మీద పిల్లిలా.. తేలుకుట్టిన దొంగలా మారిపోయారని రోజా ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో వాస్తవాలు తేలితే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉండాలని అన్నారు. కేంద్రం, కేసీఆర్ కాళ్లు పట్టుకోవడమే బాబుకు తెలుసని.. జగన్కు అవి తెలియవని అన్నారు.
వీళ్లేనా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది..?
నారాయణ, చైతన్య కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోని మంత్రి గంటా కూడా.. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారనంటూ మండిపడ్డారు. సూట్ కేసులు తీసుకుని కేసులు లేకుండా చేస్తున్నారని రోజా ఆరోపించారు. బ్యాంకులకు రూ. 200 కోట్లు పంగనామాలు పెట్టిన గంటా కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శస్తారా? అంటూ మండిపడ్డారు.
దేశంలోనే చర్చనీయాంశం
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని రోజా చెప్పారు. హోదా రావాలంటే టీడీపీ ప్రభుత్వం, కేంద్రం మెడలు వంచాలని, మహిళలంతా జగన్ కు అండగా ఉండాలన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామా అంశంపై ఇప్పుడు దేశంలోనే చర్చనీయాంశంగా మారిందన్నారు. వైసీపీతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గ్రామ గ్రామాన బెల్టు షాపులు తెరిచి మహిళల తాళిబొట్లకు ఎసరపెట్టారని మండిపడ్డారు.
రేవంత్ తీసుకెళ్లిన డబ్బులు బాబువే..
తెలంగాణ ఎమ్మేల్యేలను చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసేందుకు యత్నించిన విషయం నిజం కాదా? అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తీసుకెళ్లిన డబ్బులు చంద్రబాబువేనని ఆయన అన్నారు. ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ' అన్న వ్యాఖ్యలు చంద్రాబబువేనని చెప్పారు. ఆడియో, వీడియో టేపుల్లో దొరికి ఇంకా నీతి వ్యాఖ్యలు చెబుతున్నారంటూ చంద్రబాబుపై మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. తాము సాధారణ ఎన్నికలకు 15నెలల ముందే రాజీనామా చేస్తున్నామని, చంద్రబాబు తన పరపతిని ఉపయోగించి తమ రాజీనామాలను ఆమోదింపజేయాలని అన్నారు. అంతేగాక, పార్టీ ఫిరాయించిన 23మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి పోటీ చేయించాలని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని అన్నారు.