నారాయణ అంటే గంటాకు భయం: రిషికేశ్వరి ఘటనపై రోజా, మోడీపై కేసుల మీద హరిబాబు
హైదరాబాద్/విశాఖ: రిషికేశ్వరి మృతికి కారణమైన బాబురావును ఎందుకు అరెస్టు చేయడం లేదని, ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎందుకు సమాధానం రావడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో మహిళా వ్యతిరేక పాలన కొనసాగుతోందన్నారు. మహిళల పైన దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ుందన్నారు. చంద్రబాబు సర్కార్ నేరస్తులకు అండగా నిలుస్తోందన్నారు.
బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను ఆమోదించి తక్షణమే బాబురావు పైన విచారణకు ఆదేశించాలన్నారు. బాబురావును అరెస్ట్ చేసే విషయంపై ప్రభుత్వం వెకనడుగు వేయడానికి కారణమేమిటని నిలదీశారు.
నిష్పక్షపాత దర్యాప్తు అంటూ ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదన్నారు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన కార్పొరేట్ కళాశాల నారాయణలో 11 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు.
తక్షణమే నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా వైసిపి పోరాడుతుందని చెప్పారు. రిషికేశ్వరి తల్లిదండ్రులు కోరుకున్నట్లు సమగ్ర విచారణ జరిపించాలన్నారు.
రాజధాని భూముల కోసం హడావుడి చేసే మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావులు ఒక్కసారి కూడా నాగార్జున వర్సిటీని సందర్శించలేదన్నారు.
అసెంబ్లీలో ప్రతి విషయానికి లేచే దూళిపాళ్ల నరేంద్ర తన నియోజకవర్గంలో జరిగిన రిషికేశ్వరి ఆత్మహత్యపై ఎందుకు స్పందించలేదన్నారు. దీంతో, ప్రిన్సిపల్ బాబురావు వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ముఖ్యమంత్రికి రిషికేశ్వరి తల్లిదండ్రులు లేఖ రాసినప్పటికీ స్పందించడం లేదన్నారు.
మంత్రి గంటా శ్రీనివాస రావు తన వియ్యంకుడు నారాయణకు భయపడే ఆ కళాశాల పైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారన్నారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యల పైన విచారణ జరిపించి తప్పులు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలు అంతా ఏకమై టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నిలదీసి పోరాడలన్నారు.
ఉనికి కోసమే హోదాపై కాంగ్రెస్ ఆందోళనలు: హరిబాబు
ప్రత్యేక హోదాపై ప్రజలను మోసం చేశారంటూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులపై ఏపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఫిర్యాదులపై విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఘాటుగా స్పందించారు. పార్టీ ఉనికి కోసమే హోదాపై ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఏదో ఒక రకంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలనే కాంగ్రెస్ తాపత్రయపడుతోందన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఏపీకి ఎన్నడూ రానంత సాయం కేంద్రం ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా మంచిదా లేక ప్రత్యేక ప్యాకేజీ మంచిదా అని కేంద్రం ఆలోచిస్తోందని, విభజన సమయంలో ఎటువంటి సరైన జాగ్రత్తలను కాంగ్రెస్ తీసుకోలేదని, అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నారు.