భోగి పండుగ నాడు కూడా చంద్రబాబును వదలని రోజా..ఆయనవన్నీ డ్రామాలంటూ
నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. బోగి పండుగ నాడు చంద్రబాబుపై చెలరేగిపోయారు. భోగి మంటల సాక్షిగా ఆయనను ఏకిపారేశారు. చంద్రబాబు హయాంలో ప్రజలు పడిన బాధలన్నీ భోగి మంటల్లో పటాపంచలు కావాలని చెప్పిన రోజా చంద్రబాబు గొప్ప నటుడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పండుగ నాడు కూడా బాబును టార్గెట్ చేసి తిట్టిపోశారు.
భోగి సంబరాల్లో పాల్గొన్న రోజా
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నేడు భోగి సందర్భంగా భోగి మంటలతో తెలుగు వాళ్ళ ముంగిళ్ళు మురిసిపోతున్నాయి. కానీ ఏపీలో ఈ సారి సంక్రాంతి కొందరికి మోదాన్ని కొందరికి ఖేదాన్ని కలిగిస్తుంది. ఇక ఈ వేడుకల్లో భాగంగా నగరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా.. తన ఇంటి ముందర కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పిన రోజా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు . జగన్ మోహన్ రెడ్డి పాలనకు కితాబిచ్చారు.
జగన్ పాలనలో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నా అన్న రోజా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రజలు కష్టాలు అనుభవించారని చెప్పారు రోజా .ఇక ఇంటి ముందు భోగి మంటలు వేసిన కారణం చెప్పిన రోజా తొమ్మిదేళ్లు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన కష్టాలు, నష్టాలు, సమస్యలన్నీ ఈ భోగిమంటల్లో పటాపంచలైపోవాలని పేర్కొన్నారు. ఈ భోగి వెలుగుల్లా రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ప్రతిఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు . భోగ భాగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని రోజా పేర్కొన్నారు.
భోగి నాడు చంద్రబాబుపై రోజా విమర్శలు
ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై భోగి నాడు కూడా రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని అమరావతి రైతుల కోసం అంటూ సంక్రాంతి పండుగకు దూరంగా ఉన్నానని చెప్తూ చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారనిమండిపడ్డారు. చంద్రబాబు నటనలను ఎవ్వరూ నమ్మరన్నారు నగరి ఎమ్మెల్యే రోజా . చంద్రబాబు అంత పెద్ద నటుడు ఎవ్వరూ ఉండరని గతంలో ఎన్టీఆర్ కూడా చెప్పారని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ?
సిఎంగా ఉన్న సమయంలో రైతులు పండించుకునే మూడు పంట పొలాలను లాక్కొని, ఇవ్వని వాళ్ల పొలాలను తగలబెట్టేశారని, అక్కడ ఉన్న రైతులను నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో.. ఏం చేయకుండా ఇవాళ జోలె పట్టుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అయిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో.. రాజధానిని ఎందుకు పర్మినెంట్ చేయలేదో చెప్పాలని రోజా ప్రశ్నించారు. కనీసం ఎక్కడా కూడా పర్మింనెట్ స్ట్రక్చర్ను నిర్మించలేదని ఆమె మండిపడ్డారు.
మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఏం చేశారు ?
అమరావతిని రాజధానిగా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రశ్నించిన రోజా మూడు లక్షల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చిన ఆయన..రాజధాని కట్టకుండా ఏం చేశారన్నారు. అసలు ఆ డబ్బంతా ఏం చేశారన్నది ఎవరికీ తెలియని పెద్ద ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. చంద్రబాబు ఆ లెక్కలు చెప్పాలని ఆమె మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటె చంద్రబాబు ఒర్చుకోలేకపోతున్నారని ఆమె మండిపడ్డారు . భోగి నాడు కూడా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు రోజా .