తిరగబడితే ఇలాగే: రాజేంద్రప్రసాద్ గెలుపుపై రోజా, మురళీ మోహన్కేనా
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు కొందరు పెద్దలకు మంచి గుణపాఠమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, ప్రముఖ సినీ నటి రోజా శుక్రవారం అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికైనందుకు రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలకు గుణపాఠమన్నారు. పేద కళాకారుడు తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఫలితాలు మంచి నిదర్శనం అన్నారు. డబ్బున్న వారి మాటే చెలామణి అవుతోందని, గర్వించిన వారికి తగిన శాస్తి జరిగిందన్నారు.
గతంలో కొందరు గౌరవం కోసం మా అధ్యక్ష పదవిని వాడుకున్నారని విమర్శించారు. వారు కళాకారులకు ఏమీ చేయలేదన్నారు మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడం సంతోషమన్నారు. ఆయన కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, రోజా వ్యాఖ్యలు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ నటుడు మురళీ మోహన్ను ఉద్దేశించే కావొచ్చునని అంటున్నారు. మా ఎన్నికల ఓటింగ్ సమయంలోను ఆమె ఘాటుగానే స్పందించారు. ఈ ఓటమి జయసుధది కాదని, మురళీ మోహన్ వల్లనే జయసుధ ఓడారనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.