నా క్లిప్పింగ్ మాత్రమే, జగన్ని అంటే ఊరుకోవాలా: వీడియోపై రోజా
హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే అసెంబ్లీకి సంబంధించిన వీడియో ఫుటేజీని మొత్తం విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా బుధవారం అన్నారు. అసెంబ్లీ వీడియో ఫుటేజీని టీడీపీ విడుదల చేసింది. దీనిపై రోజా ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
తాము అసభ్య పదజాలం ఉపయోగించలేదన్నారు. ఆ వీడియోలో టీడీపీ సభ్యులవి ఏవని ప్రశ్నించారు. తమను 420 అంటే చూస్తూ ఊరుకోవాలా అన్నారు. ఇన్నేళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, తాను ఎప్పుడు హద్దు దాటలేదన్నారు. మొత్తం సీడీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ దృశ్యాల మొత్తం సీడీని విడుదల చేయాలన్నారు. మమ్మల్ని మాత్రమే చూపించారన్నారు. మాట మాట్లాడితే ఎస్సీలను తన పైకి ఉసిగొల్పుతున్నారన్నారు. ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని ఇష్టారీతిగా మాట్లాడవద్దన్నారు. చంద్రబాబు పని వాళ్ల కంటే హీనంగా ఎమ్మెల్యేలను తిడుతున్నారని ధ్వజమెత్తారు.
మీడియా వాళ్లు కూడా తప్పు చేసిన వాళ్లను వదిలేసి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఎస్సీల పట్ల నేనెప్పుడు గౌరవంగానే ఉన్నానని చెప్పారు. ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి రన్నింగ్ కామెంటరీ చేయడం సరికాదన్నారు. ఈ రోజు నా క్లిప్పింగ్ మాత్రమే ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు.
మంగళవారం నాడు పదేపదే అసెంబ్లీని వాయిదా వేసే బదులు తమకు మాట్లాడే అవకాశం ఇస్తే సరిపోయేది కదా అన్నారు. తమ పార్టీ నేత పైన కట్టుకథలు అల్లుతుంటే తాము మౌనంగా ఎందుకు ఉంటామని ప్రశ్నించారు. మమ్మల్ని మాత్రమే దోషులుగా చూపించడం అన్యాయమన్నారు.