మీరు జగన్ను అంటారా?: పరిటాల సునీతపై చెప్పులు ఎందుకు వేశారో చెప్పిన రోజా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు పరిటాల సునీత పైన చెప్పులు, చీపుర్లతో తిరగబడటంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా సోమవారం నాడు స్పందించారు. తెలుగుదేశం పార్టీ అరాచకాలను తట్టుకోలేకనే మహిళలు ఇలా దాడి చేశారని చెప్పారు.
కాగా, రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తిలో పసుపు - కుంకుమ కార్యక్రమంలో కొందరు డ్వాక్రా మహిళలు.. తమకు రుణమాఫీ చేస్తానని చేయలేదని చెబుతూ పరిటాల సునీత ఎదురుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో వారు సునీత వాహనంపైకి చెప్పులు విసిరారు. దీనిపై రోజా స్పందించారు.
జగన్ సొంత ఇలాకాలో పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తారా, ఇదీ లెక్క?: టీడీపీ బలం పెరుగుతోందా?
జగన్ గురించి మాట్లాడుతావా?
మహిళలకు న్యాయం చేయలేని పరిటాల సునీత తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం విడ్డూరమని చెప్పారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయగల సత్తా మీకు ఉందా అని సవాల్ చేశారు. తనకు మరోసారి ఓటు వెయ్యాలని చంద్రబాబు అడుగుతున్నారని, కానీ ప్రజలకు ఏం చేశారని ఆయనకు ఓటు వేయాలో చెప్పాలని నిలదీసారు.
అందుకే పసుపు -కుంకుమ
నరకాసుర పాలన చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని రోజా ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలు చేసి తీరుతామని చెప్పారు. రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పసుపు - కుంకుమ, ఇతర పథకాల పేర్లతో మోసానికి దిగారన్నారు. మహిళలు తాళిబొట్లు తెంపే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆయన మహిళల ద్రోహి అన్నారు.
చంద్రబాబుకు చేతనైతే అలా చేయాలి
చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తే ఏపీలో అక్కాచెల్లెమ్మల ఆత్మహత్యలు ఉండకపోయేవని రోజా చెప్పారు. పోస్ట్ డేటెడ్ చెక్కులతో ఔట్ డేటెడ్ ముఖ్యమంత్రి సరికొత్త నాటకానికి తెరలేపారన్నారు. చంద్రబాబుకు మహిళలపై ప్రేమ ఉంటే డ్వాక్రా రుణాలు రద్దు చేసి మాటలాడాలని చెప్పారు. చేతనైతే బెల్టు షాపులు లేకుండా చూడాలన్నారు.