రోజా షాకింగ్, కేసు: సొమ్మసిల్లడంపై టీడీపీ వ్యాఖ్య
చిత్తూరు: ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ శుక్రవారం చిత్తూరు జిల్లా పుత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సమావేశం వద్ద నగరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా చేపట్టిన ఆందోళన కార్యక్రమ క్రమంలో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయడానికి దారి తీశాయి.
అధికారులపై కేసులు పెట్టడానికి తాము అంటరానివారం కాదని, దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చని ధర్నా సందర్భంగా సీఐ సాయినాథ్తో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుత్తూరు పోలీసులు రోజాపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో తనపై అక్రమ కేసులను బనాయించిన సిఐని, ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే రోజా దళితనేతలు, వైసీపీ నేతలతో కలిసి శనివారం పుత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం 10 గంటల నుండి మండుటెండలో ఆందోళనకు దిగారు.
వీరికి పోటీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రోజాను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు, విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాను చట్టం ప్రకారం వ్యవహరించానంటూ సిఐ చెప్పి వెళ్లిపోయారు. దీంతో రోజా మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఒక అధికారి ప్రజాప్రతినిధి పట్ల నిర్లక్ష్యంగా వ్వవహరించడం ఎంత వరకూ ధర్మమంటూ రోజా డీఎస్పీని ప్రశ్నించారు. అదే సమయంలో టీడీపీ నాయకులు.. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో రోజా రక్తపోటు ఎక్కువ కావడంతో కుప్పకూలిపోయింది. వెంటనే వైసీపీ నేతలు ఆమెను స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆమెను చూడటానికి ఎక్కువ మంది వస్తుండటంతో స్థానిక వైసీపీ నేత ఇంటికి తరలించారు.
అయితే ఆమెకు రక్తపోటు తగ్గకపోవడంతో అక్కడ నుండి స్విమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజా చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని రోజా నటిస్తూ ఉందని ఆమెను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు.
ప్రజా సమస్యల కోసం గొంతు విప్పితే తనపై కుట్రపన్నిన టీడీపీ నేతలు అక్రమంగా ఎస్సీ, ఎస్టి అట్రాసిటి కేసులు పెడతారా? అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, రోజా మాట తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులను కించపరిచేవిధంగా ఆమె మాట్లాడిన తీరును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో పలు చోట్ల రోజాకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు.