రంగాను ఎలా హత్య చేశారో చూశాం, జగన్లా బాబుపై హత్యాయత్నం జరిగితే: రోజా
అమరావతి: తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కత్తి దాడి ఘటన నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా సోమవారం అన్నారు.
నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో అర్థమైందా: బాబు, కాంగ్రెస్తో దోస్తీ, కేసీఆర్ పాలనపై కీలక వ్యాఖ్యలు
జగన్ పైన హత్యాయత్నం జరిగి పది రోజులు అయిందని చెప్పారు. కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు అండ్ కంపెనీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని దొంగల పార్టీగా మార్చారన్నారు. టీడీపీ తెలుగు దొంగల, ద్రోహుల పార్టీగా మారిపోయిందని చెప్పారు.
తెలుగు దాల్ పప్పూగా
జగన్ను తెలుగు ప్రజలు దేవుడిలా చూస్తున్నారని రోజా అన్నారు. హత్యాయత్నంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి అని ఆరోపించారు. తెలుగుదేశం అంటే తెలుగు దొంగల పార్టీగా, తెలుగు దాల్ పప్పూగా మార్చారని సెటైర్లు వేశారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక హత్యాయత్నం చేయించారన్నారు.
జగన్ హుందాగా ప్రవర్తించారు
చంద్రబాబు గతంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని రోజా అన్నారు. జగన్కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పైన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. తనపై హత్యాయత్నం జరిగినప్పటికి జగన్ చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పారు.
చంద్రబాబు శునకానంద అధ్యక్షుడు
నాయకుడికి కులం ఎందుకని, గుణం కావాలని రోజా అన్నారు. కులాల పేర్లు చెప్పి ఓట్లు అడగవద్దని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టో చూస్తే అంతా కులాల కంపే అన్నారు. కులాల వారీగా విడదీసి మనుషుల మధ్య చిచ్చు పెట్టారన్నారు. హత్యాప్రయత్నం తర్వాత చంద్రబాబు వెకిలిగా మాట్లాడుతున్నారని, ఇక నుంచి చంద్రబాబును శునకానంద పార్టీ అధ్యక్షుడిగా పిలవాలని ఎద్దేవా చేశారు.
అదే హత్యాయత్నం చంద్రబాబుపై జరిగితే ఓవర్ చేసేవారు
అదే (హత్యాయత్నం) ఘటన చంద్రబాబుపై జరిగి ఉంటే చాలా ఓవర్ చేసి ఉండేవారని అన్నారు. బాధ్యత కలిగిన పౌరుడిగా జగన్ ప్రవర్తించారని చెప్పారు. జగన్ పైన దాడి కేసును నీరుగార్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. హత్యాయత్నంపై నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. జగన్ అభిమానులమని నిందితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో చెప్పించి కేసును తప్పుదారి పట్టిస్తున్నారని రోజా ఆరోపించారు. జనవరి నుంచి కత్తి ఆ హోటల్లోనే ఉంటే ప్రదీప్ చౌదరి ఎందుకు అడ్డు చెప్పలేదని నిలదీశారు.
వంగవీటి రంగాను ఎలా హత్య చేయించారో చూశాం
ఆపరేషన్ గరుడ నిజం అవుతుంటే నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని రోజా ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ చూట్టు తిరుగుతున్నారన్నారు. చంద్రబాబును వ్యతిరేకించిన వంగవీటి రంగాను ఎలా హత్య చేయించారో చూశామని, సొంత మామకు ఎలా వెన్నుపోటు పొడిచారో చూశామని, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేంద్రంలో ఎలా కుట్రలు పన్నారో చూశామని, ఇప్పుడు జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక మళ్లీ కుట్రలు పన్నుతున్నారన్నారు.
బాబు వల్ల చిన్న వయస్సులో రాహుల్ గాంధీ రిటైర్
జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది ఐరన్ లెగ్ అని రోజా అన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న నేతలు అందరూ రిటైర్ అయిపోయారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చిన్న వయస్సులో రిటైర్ కావాల్సిన పరిస్థితి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతో వినాశనమే అన్న చంద్రబాబు ఎలా పొత్తు పెట్టుకున్నారని, పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లిన దాఖలాలు లేవన్నారు. నాడు రాహుల్ పైన చెప్పులు వేయాలన్న చంద్రబాబు, ఇఫ్పుడు చెప్పులు మోస్తున్నారన్నారు. కాంగ్రెస్తో కలిస్తే ఉరి తీసుకుంటానన్న కేఈ కృష్ణమూర్తి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కాంగ్రెస్తో కలిస్తే బట్టలు ఊడదీసి తెలుగు ప్రజలుకొడతారని అయ్యన్నపాత్రుడు చెప్పారని, ఇప్పుడు ఆయన ఏమంటారని అడిగారు. ఎయిర్ పోర్టుల నుంచి బహిష్కరించిన విషయం ఎంపీ జేసీ మరిచిపోయారా అన్నారు. ఒకసారి కోడి కత్తితో ఎంపీ జేసీ పొడుచుకుంటే తెలుస్తుందన్నారు. చంద్రబాబు మాటలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. కాంగ్రెస్తో పొత్తు చూసి చీదరించుకుంటున్నారన్నారు.