ప్రజలు మూలాన కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: మహానాడు తీర్మానాలపై రోజా ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి విరుచుకుపడ్డారు. టిడిపి మహానాడులో చంద్రబాబునాయుడు చేస్తున్న తీర్మానాలు చూసి జనం తెగ నవ్వుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు, ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు అనే విషయాన్ని తెలియజేస్తుందని రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని టీడీపీ తీర్మానం సిగ్గుచేటు
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఇక ఎన్టీఆర్ ఫోటోకి దండేసి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ తీర్మానం పెట్టడం సిగ్గుచేటని రోజా దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబే అన్న విషయం అప్పుడే మరిచిపోయారా అంటూ ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొని,వారిలో నలుగురిని మంత్రులను చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబు కాదా అంటూ రోజా ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు ఏం జరిగినా బుద్ధి రావట్లేదు
ప్రజలు ఒక మూల కూర్చోపెట్టినా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదని రోజా విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని రోజా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోను తెలుగు దేశం పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించారని రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నారని రోజా విమర్శించారు.
ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారు ఏపీ సీఎం జగన్
ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని,ఈ విషయం చంద్రబాబుకు తెలియదా అని రోజా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు పదివేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రోజా పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు.
33 సంక్షేమ పథకాలు పెడితే 33 సీట్లైనా జనం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
మద్యపాన నిషేధం కోసం దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారని , మహిళలకు సున్నా వడ్డీ రుణాలను, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాకుండా 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు 33 సంక్షేమ పథకాలు పెడితే పథకానికి ఒక సీట్ చొప్పున అయినా ప్రజలు ఎందుకు ఇవ్వలేదని, జనం ఎందుకు చంద్రబాబును ఛీ కొట్టారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. టిడిపి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2020 లో చేస్తున్న తీర్మానాలపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.