స్నేహితుడి కూతుర్నే చంద్రబాబు పట్టించుకోవట్లేదు: రోజా, హోదాపై మురళీ మోహన్
చిత్తూరు/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రోజు బుధవారం నాడు మరోసారి మండిపడ్డారు. స్నేహితుడి కుమార్తెనే పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బాలికల సంరక్షణ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారన్నారు. తన స్నేహితుని కుమార్తె జరీనా బేగం చావు బతుకుల మధ్య ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 27 మంది మృతికి కారణమయ్యారన్నారు.
గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి మృతికి కారకుల పైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పాలనను గాలికి వదిలేసి చంద్రబాబు విలాసాల కోసం విదేశాలకు వెళ్లాడని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు మహిళల రక్షణ కోసం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారని, కానీ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. పైగా వారి ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదాపై మురళీ మోహన్
రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మురళీ మోహన్ బుధవారం నాడు లోకసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన మాట్లాడారు. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా తప్ప మరో మార్గం లేదని మురళీ మోహన్ అన్నారు. హోదా వస్తేనే రాష్ట్రం అభివద్ధి చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని చెప్పారు.