దెబ్బకు చంద్రబాబుకు ముచ్చెమటలు, 2017లో ఆయనే చెప్పారు: రోజా
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నరని తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వణికిపోయారని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం ఎద్దేవా చేశారు. ఆయనకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు.
పవన్ కళ్యాణ్! దమ్ముందా: నారా లోకేష్, మరోసారి నోరు జారిన మంత్రి
ఈ ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉన్నప్పటికీ టెండర్లను తమకు అప్పగిస్తే ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు అవసరం లేదంటూ ఏపీ భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఏ కేంద్రమంత్రి వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
అందుకే కేబినెట్ మీటింగ్ పెట్టారు
కానీ నితిన్ గడ్కరీ వస్తున్నారని తెలియగానే కేబినెట్ మీటింగ్ పెట్టారని రోజా ఎద్దేవా చేశారు. గడ్కరీతో పాటు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లవద్దని మంత్రులు చెప్పినా కూడా, చంద్రబాబు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. గడ్కరీ వెంట వెళ్లాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ప్రాజెక్టు టెండర్లలో ఏ మేరకు అవకతవకలు జరిగాయనే విషయం అర్థమవుతోందన్నారు.
2017 లో చంద్రబాబే చెప్పారు
జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు ప్రకటిస్తే బీజేపీతో కుమ్మక్కయిందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని రోజా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిపించాలని, అలా అయితే డబ్బు, సమయం ఆదా అవుతుందని 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని తెలిపారు.
ఆకాశం ఏమైనా బద్దలవుతుందా?
చంద్రబాబు, లోకేష్ల అవినీతి వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదని మరో వైసీపీ ఎమ్మెల్యే సురేష్ ఆరోపించారు. దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కేంద్రం చేసిన ప్రకటనతో టీడీపీ సర్కార్ మరోసారి లేని గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు ఏపీకి తీసుకు వచ్చారో చెప్పాలన్నారు. దీని వల్ల ఆకాశం ఏమైనా బద్దలవుతుందా అన్నారు.
బాబు పాలనలో లక్షల కోట్ల అప్పు
గతంలో పలుమార్లు ఏపీకి ర్యాంకులు వచ్చాయని సురేష్ అన్నారు. ఏ రంగంలోన చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్నారు. చంద్రబాబు ప్రయోజనం లేని విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకులు ఇఛ్చిన ర్యాంకులు ప్రజలకు వద్దని, చంద్రబాబు పాలనలో ఏపీ అప్పు రూ.2.3 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఎక్కడ ఎంత అప్పు తెచ్చి, ఎక్కడ పెట్టారో విచారణ చేయించాల్సి ఉందన్నారు.