జగన్లో 'బాహుబలి'ని చూసిన రోజా, ప్రత్యేక హోదా పక్కన పెట్టండి!: పురంధేశ్వరి
గుంటూరు/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బాహుబలితో పోల్చారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భల్లాలదేవుడు, కాలకేయుడు అయితే.. ఆయనను ఎదిరించేందుకు ఇక్కడ బాహుబలి ఉన్నారన్నారు.
గుంటూరు జిల్లాలోని నల్లపాడులో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జగన్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... చంద్రబాబును ఎదిరించేందుకు ఇక్కడ బాహుబలి ఉన్నారని జగన్ను చూస్తూ చెప్పారు.
చంద్రబాబుపై రోజా గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చంద్రబాబు చేయికలిపి, జగన్ను జైలుకు పంపారన్నారు. రాష్ట్ర విభజన కూడా చంద్రబాబు కుట్రే అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 40 ఏళ్ల వయసున్న జగన్ను చూసి వణుకుతున్నారన్నారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన దీక్షను చూసి టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ఎలాగైనా జగన్ దీక్షను ఆపాలని చంద్రబాబు యత్నిస్తున్నారని, దీక్షను ఆపడం ఆయన తరం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే వరకు టీడీపీ నేతలను గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వవద్దన్నారు.
ప్రత్యేకహోదాకు మించి సహకారం అందిస్తున్నాం: పురందేశ్వరి
ఏపీకి ప్రత్యేక హోదాకు మించి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని బిజెపి జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో పండిత్ దీన్దయాళ్ ప్రశిక్షణ్ తరగతుల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా, ప్యాకేజిపై కాకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి వనరులు అధికంగా అందిస్తుందన్నారు. ఒక రాష్ట్రానికి ఇంత పెద్దఎత్తున నిధులు అందించడం గొప్ప విషయమన్నారు.
14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పిన నేపథ్యంలో ఆ అంశాన్ని నీతి ఆయోగ్కు పంపినట్లు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఖర్చు పెట్టిన నిధుల వివరాల ప్రమాణపత్రాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయడం ద్వారా మరిన్ని నిధులు పొందవచ్చన్నారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపి బలమైన పార్టీగా నిలుస్తుందని చెప్పారు. బీహార్ ఎన్నికల్లో బిజెపి గెలుపు తథ్యమన్నారు.
మోడీని అడగాలి: డొక్కా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష పైన మాజీ మంత్రి, టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం మండిపడ్డారు. జగన్ దీక్ష విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని, ప్రధాని మోడీని అడగాలన్నారు.