వేదిక పైనే సీరియస్ చర్చ.. జగన్తో రోజా ఏం మాట్లాడారు..?
చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేదికపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే రోజా వెళ్లి ఆయన కుర్చీలో కూర్చున్నారు. అంతకుముందు వేదిక పైనే ఆసీనులై ఉన్నప్పటికీ.. జగన్కు కొద్ది దూరంలో కూర్చుని ఉన్నారు. ఆయన పక్కన కుర్చీలో మంత్రి పెద్దిరెడ్డి కూర్చున్నారు. పెద్దిరెడ్డి మైక్లో ప్రసంగించేందుకు వెళ్లగా.. రోజా జగన్ పక్క కుర్చీలోకి చేరిపోయారు.
ఈ సందర్భంగా జగన్తో రోజా సీరియస్గా చర్చించడం కనిపించింది. రోజా మాట్లాడుతున్న సమయంలో.. ఆమెను ఆపి ముందు మంచి నీళ్లు తాగమని జగన్ సూచించారు. తలపై చేయితో నిమిరి ఆమెను ఓదార్చారు. ఇదంతా చూసి.. రోజా అంత సీరియస్గా జగన్తో ఏం చర్చించి ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల తన నియోజకవర్గంలోని కేబీఆర్ పురంలో సొంత పార్టీ నేతల నుంచే ఎదురైన ప్రతిఘటన గురించి రోజా జగన్తో చర్చించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ ఘటనపై రోజా మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన కొందరు పెద్ద నాయకులు తన ఓటమికి కుట్ర చేశారంటూ ఆరోపించడం కూడా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డినే రోజా టార్గెట్ చేశారా అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. తన కారుపై దాడి చేసినవాళ్ల గురించి ఆమె కేసులు కూడా పెట్టారు. వారిపై చర్యలు తీసుకోవాలని అధినేత జగన్కు కూడా విజ్ఞప్తి చేశారు. బహుశా ఇదే విషయంపై రోజా తాజాగా జగన్తో చర్చించి ఉండవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.
కాగా,మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని రోజా భావించారు. కానీ పెద్దిరెడ్డి అడ్డుకోవడం వల్లే తనకు మంత్రి పదవి రాలేదని ఆమె భావిస్తున్నారన్న ప్రచారం ఉంది. రెండున్నరేళ్ల తర్వాత తనకు మంత్రి పదవి దక్కుతుందని రోజా భావిస్తున్నప్పటికీ.. సొంత నియోజవకర్గంలో రేగుతున్న చిచ్చు పదవి ఆశలకు మళ్లీ గండి కొడుతుందా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. మొత్తం మీద పెద్దిరెడ్డి,రోజా మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయన్న చర్చ జరుగుతోంది. వీటిపై జగన్ ఎలా స్పందించబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.