ద్వంద్వ అర్థాల జబర్దస్లో జడ్జి: 'రోజాని అసెంబ్లీలో అడుగు పెట్టనీయొద్దు'
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజాను అసెంబ్లీలో అడుగుపెట్టనీయవద్దని ప్రముఖ న్యాయవాది శోభారాణి అన్నారు. ఆమె బుధవారం నాడు గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆడవారి ఆత్మస్థైర్యాన్ని, హుందాతనాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న రోజాను శాశ్వతంగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. జబర్దస్త్ లాంటి జుగుప్సాకరమైన, ద్వంద్వ అర్థాలు వచ్చే షోలో ప్రజాప్రతినిధి అయిన రోజా జడ్జిగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు.
రోజా లాంటి వారు చట్టసభల్లో ఉన్నంత వరకు ఆడవారికే కాదు.. సమాజానికే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రోజాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలని వ్యాఖ్యానించారు. కాగా రోజా అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో ఏడాది పాటు సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే.
అసెంబ్లీలో రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యే అనితల పైన అనుచితంగా ప్రవర్తించారని చెబుతూ, ప్రభుత్వం ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. దీనిపై రోజా హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.