'జగన్! రోజాను అదుపులో పెట్టు, ఆమె నారా బ్రాహ్మణికి సారీ చెప్పాలి'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజాను అదుపులో పెట్టాలని, లేదంటే ప్రజలు వారికి బుద్ధి చెప్పడం ఖాయమని టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం అన్నారు.
రోజాకు పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శించే స్థాయి రోజాకు లేదన్నారు. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రోజా తీరు మార్చుకోలేదని ధ్వజమెత్తారు. రోజాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
నోట్ల రద్దుతో జగన్ మంచాన పడ్డారు: వర్ల
నోట్ల రద్దుతో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచాన పడ్డారని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు. నోట్ల రద్దు పైన అసలైన దొంగ వైయస్ జగన్ నోరు తెరవడం లేదన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై వైసిపిలోని చిన్న దొంగలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
టిటిడి చైర్మన్ కాకముందు భూమన కరుణాకర్ రెడ్డి ఆదాయం ఎంత అని ప్రశ్నించారు. భూమన వెంకటేశ్వర స్వామి సొత్తు దోచుకున్నారని ఆరోపించారు. అవినీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కులు పొందిందన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం రోజాకే చెల్లిందన్నారు. రోజా తమ పార్టీ యువనేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణికి క్షమాపణలు చెప్పాలన్నారు.