రచ్చబండలో చెంపచెల్లుమనిపించిన రోజా, సెల్వామణితో ప్రేమపై..
హైదరాబాద్: సినీ పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆర్కే రోజా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అంతేగాక, జబర్దస్త్ షోలో ఇప్పటి వరకు నవ్వులతో సందడి చేసిన ఆమె.. ఇప్పుడు జెమిని టీవీలో ప్రసారమయ్యే 'రచ్చబండ' కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
విభేదాలు, వివాదాలతో విడిపోయిన జంటల కాపురాలను చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా జెమిని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే, ఈ కార్యక్రమంలో వచ్చిన ఓ జంట విషయంలో ఆమె సీరియస్ అయ్యారు. అంతేగాక, ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన షోకు వచ్చిన వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించేందుకు కూడా సిద్ధమయ్యారు. అతనిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ తోపాటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఓ ఛానల్ వస్తున్న బతుకు జట్కా బండి అనే కార్యక్రమానికి ధీటుగా జెమిని రచ్చబండ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విడిపోయిన కాపురాలను చక్కదిద్దడం ఈ కార్యక్రమం సారాంశం. కాగా, వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళ కష్టాలను విన్న రోజా కరిగిపోయారు. ఆమె భర్త ఆమెకు చేసిన అన్యాయాన్ని విని ఆగ్రహంతో ఊగిపోయారు.
సదరు మహిళను పెళ్లి చేసుకుని, ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన తర్వాత.. సదరు వ్యక్తి మరో మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక, తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అంతటితో ఆగకుండా తాను ఓ అమ్మాయితో గడిపిన తతంగాన్ని కూడా వీడియో తీసుకున్నానని చెప్పడంతో రోజాకు కోపం కట్టలు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా అతని వైపు దూసుకెళ్లి చెంప ఛెళ్లుమనిపించినట్లు సమాచారం. ఈ వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను విభిన్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు.
ఆయనో పెద్ద డైరెక్టర్.. లవ్లో పడేశానిలా: రోజా
రోజా తాను సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వమణిపై మనసు పడ్డారు. ఆ తర్వాత ఆయనతో ప్రేమాయణం కొనసాగించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే, రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
ఆ ప్రేమ వివరాలను పూసగుచ్చినట్లు చెప్పారు రోజా. సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిన ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. రోజా కూడా సెల్వమణి కోసం చాలా కష్టపడింది. ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట.
ఎందుకు ఇష్టపడ్డారని అడిగితే.. 'అసలే ఆయన పెద్ద డైరెక్టర్. నేను బుట్టలో పడేశాను కదా! అలాగే వేరే ఎవరైనా ఆయనకి లెటర్ రాసి బుట్టలో పడేస్తారేమోనంటూ' నవ్వేశారు రోజా. అంతేగాక, సెల్వమణికి ప్రశాంతంగా ఉండటం అంటే ఇష్టమని, అందుకోసమే ఇంటిలోని ఒక గదిని సైలెంట్గా ఉంచుతారట. కొసమెరుపు ఏమిటంటే సెల్వమణికి రోజా కంటే అలనాటి ప్రముఖ నటి శ్రీదేవి అంటేనే ఇష్టమట.