విమానంలో రోజా హ్యాపీ సెల్ఫీ, అంతలోనే భయంతో వణుకు!
హైదరాబాద్: సోమవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తి, మళ్లీ హైదరాబాదులో ల్యాండింగ్ అయింది. దీంతో వారు ఆలస్యంగా విమానంలో ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విమానంలో ఏకంగా 44 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఉన్నారు.
టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే విమాన సిబ్బంది నుంచి హెచ్చరికలు వినిపించాయి. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలోనే దించేస్తున్నామని ప్రకటించిన మహిళా పైలట్లు.. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు.
అయితే విమానం గాల్లోకి ఎగిరిన మరుక్షణంలోనే అందులో సాంకేతిక లోపం ఉందన్న ప్రకటనతో వైసిపి ఎమ్మెల్యేలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన ఎమ్మెల్యేలు అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కూర్చున సీట్లకు అతుక్కుపోయారు.
దేవుడిని మనసులోనే ప్రార్థించారట. ఈలోగానే మహిళా పైలట్లు విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు గంట ఆలస్యంగా వారు ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత వైసీపీ నేతలు ఎయిర్ పోర్టులోనే గ్రూపుగా లగేజీలు పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు.
అంతకుముందు విమానంలో సాంకేతిక లోపం గుర్తించడానికి ముందు రోజా సహా ఇతర నేతలు సందడి చేశారు. సీట్ల వరుసల మధ్య నిల్చుని చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగారు. రోజా సెల్ఫీ తీసుకున్న ఫొటోలు వార్తా ఛానళ్లలో ప్రసారం అయ్యాయి.
కాగా, స్పైస్ జెట్ విమానానికి సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విమానానికి పైలట్, కో పైలట్గా వ్యవహరించిన ఇద్దరూ మహిళలేనని తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు ఇద్దరు మహిళా పైలట్లు గుర్తించి వెనువెంటనే విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే.