బాబు చేతకాని దద్దమ్మలా, ఏం చెప్తావ్, జగన్ చేయాలనుకున్నది చేస్తాడు: రోజా
ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయలేని సీఎం చంద్రబాబు చేతకాని దద్దమ్మ అని రోజా బుధవారం మండిపడ్డారు.జగన్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరిగింది.
అమరావతి: ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయలేని సీఎం చంద్రబాబు చేతకాని దద్దమ్మ అని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం మండిపడ్డారు.
'ఆస్తులను అప్పగించండి, జగన్కు రివర్స్, వైసిపి మైండ్ బ్లాంక్'
జగన్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరిగింది. నవంబర్ 2వ తేదీ నుంచి తలపెట్టిన పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. అనంతరం రోజా, అంబటి రాంబాబు, మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులు బాబును నిలదీస్తున్నారు
ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో యువత, విద్యార్థులు చంద్రబాబును నిలదీస్తున్నారని, దానికి టిడిపి ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.
అందుకే జగన్ పోరాడుతున్నారు
ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి చెపితే, కాదు కాదు పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు ఆనాడు డిమాండ్ చేశారని, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఏం వివరణ ఇస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి లాభమని చెప్పారు. తన స్వార్థం కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారన్నారు. హోదా సంజీవిని కాబట్టే జగన్ పోరాడుతున్నారన్నారు.
చంద్రబాబు చేతకాని దద్దమ్మలా
పోలవరం ప్రాజెక్టు, కేంద్రవిద్యాసంస్థలు, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది తెలిసి కూడా చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని, దీనిని బట్టే చంద్రబాబు చేతకాని దద్దమ్మ అని తెలుస్తోందని రోజా విమర్శించారు. ప్రజలకు భరోసాను ఇస్తూ జగన్ పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా జగన్ పాదయాత్ర
రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ రైతులను, ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని చెప్పి యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా జగన్ పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
అనుమతిస్తారా లేదా అనే దానిపై
వైయస్ రాజశేఖర రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఎలాగైతే సువర్ణ యుగం ఇచ్చారో ఇప్పుడు జగన్ పాదయాత్ర కూడా అలాగే ఉంటుందన్నారు. జగన్ పాదయాత్రకు అనుమతి వస్తుందా, రాదా అన్నది రెండో విషయమని, ఆయన చేయాలనుకున్నది చేస్తారని రోజా చెప్పారు. పాదయాత్ర విషయమై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామన్నారు. శుక్రవారం ఒక్కరోజు కోర్టుకు వెళ్తే సరిపోతుందని, పాదయాత్ర చేయొద్దని కోర్టు చెప్పలేదన్నారు. జగన్ చేయని తప్పుకు జైల్లో ఉన్నారన్నారు. జగన్ పోరాటాల యోధుడు అని రోజా అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరినీ జగన్ కలుస్తారని చెప్పారు.